ETV Bharat / sports

శ్రీలంక క్రికెట్​ బోర్డు జాక్​పాట్​.. ఏకంగా రూ.630 కోట్ల లాభం.. చరిత్రలో తొలిసారిగా!

author img

By

Published : Feb 25, 2023, 5:03 PM IST

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆ దేశ క్రికెట్​ బోర్డు ఊరట కల్పించింది. 2022 సంవత్సరానికి గాను ఆ దేశ క్రికెట్ బోర్డు.. రికార్డు స్థాయిలో రూ.630 కోట్ల లాభాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్​ కోసం కొత్త రాజ్యాంగాన్ని రూపొందించనున్నామని ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్​ రణ్​సింగ్​ తెలిపారు.

Sri Lanka Cricket earned a record breaking 630cr in 2022
Sri Lanka Cricket earned a record breaking 630cr in 2022

శ్రీలంక క్రికెట్​ బోర్డుకు కాసుల పంట పండింది. 2022 సంవత్సరానికి గాను ఆ దేశ క్రికెట్ బోర్డు.. రికార్డు స్థాయిలో నికర లాభాన్ని ఆర్జించింది. రూ.630 కోట్ల భారీ లాభాన్ని అందుకుంది. ఆ దేశ క్రీడా సంఘం చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక నికర లాభంగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. "2022లో రూ.630 కోట్ల లాభం సమాకూరింది. అంతర్జాతీయ క్రికెట్​, దేశవాళీ క్రికెట్​, స్పాన్సర్​ షిప్​ కాంట్రాక్టులు, ఐసీసీ వార్షిక సభ్యుల చెల్లింపుల ద్వారా ఆ భారీ లాభాన్ని అందుకున్నాం" అని శ్రీలంక క్రికెట్​ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

సంక్షోభంలోనూ మ్యాచ్​లు.. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ శ్రీలంక క్రికెట్​ బోర్డు తమ దేశంలో క్రికెట్​ మ్యాచులు నిర్వహించింది. స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20, వన్డే, టెస్ట్​ మ్యాచులు ఆడింది లంక. ఆయా మ్యాచులకు క్రికెట్​ అభిమానులు విపరీతంగా తరలివచ్చారు. తమ దేశానికి వచ్చి ఆడుతున్నందుకు ఆసీస్​ క్రికెటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బ్యానర్ల రూపంలో ఆనందం వ్యక్తం చేశారు. ఆ సమయంలో శ్రీలంక క్రికెట్​ బోర్డుకు భారీగా ఆదాయం సమకూరింది.

కొత్త రాజ్యాంగం ఏర్పాటు!.. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్​ కోసం కొత్త రాజ్యాంగాన్ని రూపొందించనున్నామని ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్​ రణ్​సింగ్​ తెలిపారు. అందుకు పది మంది సభ్యుల కమిటీని నియమించినట్లు ఆయన ప్రకటించారు. ఆ కమిటీకి రిటైర్డ్​ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేటీ చిత్రసిరి నేతృత్వం వహిసిస్తున్నట్లు పేర్కొన్నారు. పలువురు ప్రముఖులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆ కమిటీలో ఉన్నట్లు వెల్లడించారు. కొత్త రాజ్యాంగ రూపకల్పన కోసం పలువురి నిపుణుల సలహాలు కోరినట్లు రణ్​సింగ్​ తెలిపారు. మరో రెండు నెలల్లో కొత్త రాజ్యాంగం సిద్ధం కానుందని చెప్పారు.

కాగా, శ్రీలంక.. త్వరలో న్యూజిలాండ్​తో తలపడనుంది. రెండు టెస్ట్​లు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యచులు ఆడనుంది. ఇరు జట్ల మధ్య మార్చి 9న తొలి టెస్ట్​ ప్రారంభం కానుంది. మార్చి 25,28,31 తేదీల్లో కివీస్​, లంక మధ్య వన్డే మ్యాచులు జరగనున్నాయి. ఏప్రిల్​ 2,5,8 తేదీల్లో టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచ్​లన్నీ న్యూజిలాండ్​లోనే జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.