ETV Bharat / sitara

తెలుగు హీరోల ప్రాణమంతా 'పాన్ ఇండియా'

author img

By

Published : Jan 19, 2022, 7:10 AM IST

Pan india telugu movies: పాన్ ఇండియా సినిమాలు.. ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువవుతున్నాయి. మన వాళ్లనే కాకుండా దేశవ్యాప్తంగా ఆడియెన్స్​ను అలరించాలని టాలీవుడ్​ హీరోలు భావిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఏయే సినిమాలు చేస్తున్నారు?

ram charan ntr
రామ్​చరణ్-ఎన్టీఆర్

Telugu latest movies: శత దినోత్సవాల సందడులు కనుమరుగయ్యాయి. వందకోట్ల క్లబ్‌లు మసకబారుతున్నాయి. ఇప్పుడందరి శ్వాస, ధ్యాస ఒకటే.. అదే పాన్‌ ఇండియా ఇమేజ్‌. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ, తమ ప్రతిభను నలుదిశలా వ్యాప్తిచేసి.. కాసులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు హీరోలు. పాన్‌ ఇండియా సంస్కృతిని ఒంటబట్టించుకుని.. వేల కోట్ల క్లబ్బుల్లో కాలు మోపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే 'బాహుబలి'తో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించగా.. ఇప్పుడీ కిరీటం అందిపుచ్చుకునేందుకు మరికొందరు తెలుగు హీరోలు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. మరి కొత్తగా ఈ రేసులోకి అడుగు పెడుతున్న ఆ కథానాయకులెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..

కొన్నాళ్లుగా తెలుగు కథానాయకుల మనసంతా పాన్‌ ఇండియా కథల చుట్టూనే తిరుగుతోంది. 'బాహుబలి', 'కేజీఎఫ్‌' చిత్రాల స్ఫూర్తితో ప్రభాస్‌, యష్‌ తరహాలో పాన్‌ ఇండియా మార్కెట్‌ను కొల్లగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కథ కాస్త వైవిధ్యంగా ఉండి.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉందనిపిస్తే చాలు.. స్టార్‌ బలాన్ని దించి.. సాంకేతిక హంగులు జోడించి పాన్‌ ఇండియా సినిమాగా వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు. నలుదిశలా మార్కెట్‌ విస్తరించే యత్నం చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం అనేక మంది తెలుగు హీరోలు ఈ పాన్‌ ఇండియా బాటలోనే నడుస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రంతో ఇప్పటికే ఈ ప్రయత్నం చేశారు. ఇటీవలే 'పుష్ప' సినిమాతో కథానాయకుడు అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ప్రయత్నానికి పర భాషల్లోనూ మంచి ఆదరణే దక్కింది. ఉత్తరాది వాసుల్ని ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్‌గా బన్నీ నటనకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలోనే దీనికి కొనసాగింపుగా రానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

allu arjun pushpa movie
అల్లు అర్జున్ పుష్ప

మనసులు దోచుకోవడానికి 'వీరమల్లు'

జయపజయాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడాయన ‘హరి హర వీరమల్లు’తో తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పవన్‌ నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా. క్రిష్‌ తెరకెక్కిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో పవన్‌ ఓ గజదొంగగా కనిపించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
.

రాజమౌళి తోడుగా మహేశ్

పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు హీరో మహేశ్​బాబు. ఇప్పుడా బాధ్యతను తన భుజాలకు ఎత్తుకోనున్నారు రాజమౌళి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఆయన మహేశ్​తో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలోనే ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. అయితే ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా గాండ్రించాలని..!

తెలుగు సినీప్రియుల మదిలో మాస్‌రాజాగా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు కథానాయకుడు రవితేజ. ఇప్పుడాయన 'టైగర్‌ నాగేశ్వరరావు'తో పాన్‌ ఇండియా రేసులో అడుగు పెట్టనున్నారు. స్టూవర్ట్‌పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. వంశీ తెరకెక్కించనున్న ఈ సినిమాని అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

.
.

కుర్ర హీరోల జోరు..

ప్రస్తుతం పాన్‌ ఇండియా కిరీటం అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్న వారి జాబితాలో పలువురు కుర్రహీరోలు ఉన్నారు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘టాక్సీవాలా’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరయ్యారైన హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడాయన్ని ‘లైగర్‌’తో పాన్‌ ఇండియా హీరోగా మారుస్తున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఈ సినిమా కోసం మైక్‌ టైసన్‌ లాంటి దిగ్గజ క్రీడాకారుడ్ని సెట్స్‌లోకి దింపారు పూరీ. ఈ సినిమా.. సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

* ఓ వైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌. త్వరలో ‘డెవిల్‌’గా దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని పలకరించనున్నారు. కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్నారు. 1945 కాలం నాటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో కల్యాణ్‌ బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనున్నారు.

* 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా శశికిరణ్‌ తిక్క తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలం విడుదల కానుంది. ఇలా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించే పనిలో మన కథానాయకులున్నారు.

త్వరలో ఇద్దరు వీరుల దండయాత్ర

'బాహుబలి' సినిమాతో ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడీ ఇమేజ్‌ను 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. 'బాహుబలి' సిరీస్‌ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో రూపొందింది. ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.