'మా' పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. మోహన్​బాబు ఆగ్రహం

author img

By

Published : Oct 10, 2021, 11:14 AM IST

Updated : Oct 10, 2021, 11:24 AM IST

maa polling

మా ఎన్నికల పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ కేంద్రం లోపలికి బయటి వ్యక్తులు వచ్చారని నటుడు నరేశ్ ఆరోపించారు. దీంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల పోలింగ్‌ (MAA Elections 2021) కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా జరుగుతున్న పోలింగ్‌లో సీనియర్‌, జూనియర్‌ నటీనటులు పాల్గొంటున్నారు. అయితే, 'మా' సభ్యులను ప్రలోభపెట్టేలా పోలింగ్‌ (MAA Elections 2021) కేంద్రం లోపల కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రకాశ్‌రాజ్- మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పోలింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తులు వచ్చారని నరేశ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్, నరేశ్ మధ్య.. నువ్వెంతంటే నువ్వెంత అనేలా వాగ్వాదం జరిగింది. గేటు బయట మాత్రమే ప్రచారం చేసుకోవాలంటూ ఇరు ప్యానల్స్‌ సభ్యులు వాదించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పది నిమిషాల పాటు పోలింగ్​ను నిలిపివేశారు అధికారులు.

దీంతో పోలీసులు కలుగచేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. వాళ్లందర్నీ అక్కడి నుంచి పంపించివేశారు. ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్న మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు' అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

సీసీటీవీ ఫుటేజీ పరిశీలన

ఈ క్రమంలోనే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు చెందిన నటుడు సమీర్‌పై ప్రత్యర్థి ప్యానల్‌ వాళ్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరఫు నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న నటి హేమ, విష్ణు ప్యానల్‌ తరఫు నుంచి కోశాధికారిగా పోటీ చేస్తున్న శివబాలాజీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కౌగిలి వెనుక చాలా అర్థాలు ఉంటాయి: ప్రకాశ్‌రాజ్‌

ప్రస్తుతం పోలింగ్‌ బాగానే జరుగుతోందని, నటీనటులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయడం మంచి విషయమని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. గెలుపెవరిదో ఓటర్లు నిర్ణయిస్తారని తెలిపారు. 'పోలింగ్‌ కేంద్రం వద్ద మీకూ నరేశ్‌కు గొడవ జరిగిందట కదా' అని అడగ్గా, 'ఇంట్లో కౌగిలించుకుంటాం. దాని వెనుక చాలా అర్థాలు ఉంటాయి' అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

మరోవైపు, 'మా' ఎన్నికల్లో కౌగిలింతలే తప్ప కొట్లాటలు లేవని నరేశ్ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: ఓటేసిన తర్వాత చిరు, పవన్ ఏం మాట్లాడారంటే?

Last Updated :Oct 10, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.