నేపాల్​ ప్రధానిగా ప్రచండ.. అమెరికా, భారత్​ను చైనా దెబ్బ తీసిందా?

author img

By

Published : Dec 30, 2022, 1:47 PM IST

Prachanda elevation as Nepal PM
Prachanda elevation as Nepal PM ()

నేపాల్‌ రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని పదవిపై ఎన్‌సీ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌-మావోయిస్టు సెంటర్‌ (సీపీఎన్‌-ఎంసీ) ఛైర్మన్‌ పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) మధ్య పడిన పీటముడితో పరిస్థితులు మారిపోయాయి. సీపీఎన్‌-యూఎంఎల్‌ నేత కె.పి.శర్మ ఓలి మద్దతుతో ప్రచండ ప్రధాని పీఠమెక్కారు. ఓలి చైనా చేతిలో కీలుబొమ్మ. ఇది భారత్‌కు రుచించని పరిణామమే.

నేపాల్​ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్​కు మద్దతుగా ఉన్న మాజీ ప్రధానమంత్రి షేర్​ బహుదూర్​ దేవ్​బా​ అధికార పీఠాన్ని కోల్పోయారు. చైనాకు మద్దతు పలికే సీపీఎన్‌-యూఎంఎల్‌ నేత కె.పి.శర్మ ఓలితో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌-మావోయిస్టు సెంటర్‌ (సీపీఎన్‌-ఎంసీ) ఛైర్మన్‌ పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రధాని పదవిపై ఓలితో పడిన పీటముడితోనే దేవ్​బా అధికారానికి దూరమయ్యారు. చైనా చేతిలో కీలుబొమ్మ ఆయిన ఓలి పార్టీ అధికారంలోకి రావడం భారత్​కు ఎదురుదెబ్బే అని కాఠ్‌మాండూలోని భారత మాజీ రాయబారి వ్యాఖ్యానించారు. భారత్​ తన నేపాల్​లో తన రాజకీయ ప్రాభవాన్ని కోల్పోయిందన్నారు.

నేపాల్‌లో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌సీ ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని స్థానాలు దక్కలేదు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాబోదని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి అర్థమైపోయింది. చైనా రంగంలోకి దిగి, ప్రధానమంత్రి పదవి వంటి స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వొద్దంటూ ఓలికి సూచించింది. ఇండియాకు అనుకూలంగా వ్యవహరించే దేవ్‌బా నేతృత్వంలోని ఎన్‌సీని గద్దె దించడంపై దృష్టిపెట్టాలని సందేశం పంపించింది. దీంతో ఎన్‌సీ, సీపీఎన్‌-ఎంసీలతో సీపీఎన్‌-యూఎంఎల్‌ నేతలు సంప్రతింపులు మొదలుపెట్టారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్‌సీకి మద్దతిచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే అప్పటికే సీపీఎన్‌-ఎంసీ సహా మరో మూడు పార్టీలతో కలిసి అధికారంలో ఉన్న దేవ్‌బా- ఓలి పక్షం నుంచి మద్దతు స్వీకరణకు ముందుకు రాలేదు. ఎన్‌సీ నేతృత్వంలో తమ సంకీర్ణ సర్కారును యథాతథంగా కొనసాగించేందుకు ప్రచండ సహా ఇతర మిత్రపక్ష నేతలు అంగీకరించారు.

అయితే, తొలివిడత ప్రధాని పదవిని తనకే ఇవ్వాలంటూ ప్రచండ పట్టుబట్టడంతో సంకీర్ణ కూటమిలో చీలికలు బయటపడ్డాయి. ప్రతినిధుల సభ స్పీకర్‌ సహా పలు కీలక పదవులను సీపీఎన్‌-ఎంసీకి దేవ్‌బా ఇవ్వజూపినా ప్రచండ బెట్టు వీడలేదు. ఈ పరిస్థితులను ఓలి తనకు అనుకూలంగా మలచుకున్నారు. తమ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చంటూ ఎన్‌సీ నేతల్లో ఆశలు కల్పించారు. తెరవెనక మాత్రం తమ సహచర కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఎన్‌-ఎంసీతో కలిసి పావులు కదిపారు. తొలి రెండున్నరేళ్లు ప్రచండ ప్రధాని పదవిలో కొనసాగేలా, ఆ తరవాత తమకు పీఠాన్ని అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకొని దేవ్‌బాను గద్దె దించారు. మావోయిస్టుల నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భారత్​ ఊహించలేదు.

చైనాకు కలిసొస్తుందా!
నేపాల్‌తో ఇండియాకు దీర్ఘకాలంగా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలున్నాయి. ఇరు దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. కాఠ్‌మాండూకు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి దిల్లీయే. నేపాల్‌ దిగుమతుల్లో సగానికి పైగా భారత్‌ నుంచే వెళ్తున్నాయి. ప్రాంతీయంగా వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఆ దేశం మనకు ఎంతో కీలకం. అయితే దక్షిణాసియాపై పట్టు కోసం తహతహలాడుతున్న డ్రాగన్‌, నేపాల్‌ను తనవైపు తిప్పుకొనేందుకు కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దేశంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను గుమ్మరిస్తోంది. తద్వారా దిల్లీపై కాఠ్‌మాండూ ఆధారపడటాన్ని తగ్గించాలన్నది డ్రాగన్‌ యోచన. ఓలి గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దానికి బాగా సహకరించారు. చైనా ఆదేశాలను శిరసావహిస్తూ భారత వ్యతిరేక ధోరణిని అవలంబించారు. భారత భూభాగంలోని ప్రాంతాలను సైతం తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొన్న కొత్త పటాన్ని నేపాల్‌ పార్లమెంటులో ఆమోదింపజేశారు. ఫలితంగా భారత్‌-నేపాల్‌ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేపాల్‌లో కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించి, కొత్త భవనాలను నిర్మించడంపై మాత్రం నోరు మెదపలేదు. నేపాల్‌లో గత సార్వత్రిక ఎన్నికల్లోనూ చైనా జోక్యం చేసుకుంది. 2018లో ఓలి, ప్రచండ చేతులు కలిపే విషయంలో క్రియాశీలక పాత్ర పోషించింది. 2021లో వారు ఎవరి దారి వారు చూసుకున్నారు. నేపాల్‌లోని రెండు అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎన్‌-యూఎంఎల్‌, సీపీఎన్‌-ఎంసీ మళ్ళీ ఇప్పుడు జట్టు కట్టడం చైనాకు కలిసివచ్చే పరిణామమే.

భారత్​-నేపాల్​ ప్రాజెక్టులపై నీలినీడలు
తాజా ఒప్పందం ప్రకారం 2025లో ఓలి ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశాలున్నాయి. అప్పటివరకు ప్రచండ నేతృత్వంలోని సర్కారులో సైతం ఆయన మాట చెల్లుబాటు కావచ్చు. దాంతో- పలు ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి భారత్‌, నేపాల్‌ల మధ్య కుదిరిన ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సీపీఎన్‌-యూఎంఎల్‌ నుంచి ఎదురైన వ్యతిరేకతను లెక్కచేయకుండా దేవ్‌బా సర్కారు భారత్‌కు అప్పగించిన జలవిద్యుత్‌ ప్రాజెక్టు భవితవ్యంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. మౌలిక వసతుల అభివృద్ధి కోసం అమెరికా నుంచి నిధులు స్వీకరించేందుకు ఎన్‌సీ నేతృత్వంలోని ప్రభుత్వం అంగీకరించింది. దాన్ని తిరస్కరించేలా ఓలి పార్లమెంటులో ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే- నేపాల్‌ ప్రగతికి విఘాతం కలగడం ఖాయం. బీజింగ్‌ చేతిలో పావుగా మారి దిల్లీ, వాషింగ్టన్‌లను దూరం పెడితే నష్టపోయేది తామేనన్న సత్యాన్ని కాఠ్‌మాండూ గుర్తించాలి. చైనా రుణాల ఊబిలో కూరుకుపోవడం వల్ల శ్రీలంకకు ఎలాంటి దుస్థితి ఎదురైందో నేపాల్‌ పాలకులు గ్రహించాలి. ఇండియాతో సత్సంబంధాలకు సముచిత ప్రాధాన్యమివ్వాలి. దేశాన్ని పేదరికం కోరల్లో నుంచి గట్టెక్కించే దిశగా కృషి చేయాలి.

--సంజయ్​ కపూర్​

ఇవీ చదవండి: ఆర్మేనియాకు పినాక.. ఫిలిప్పీన్స్​కు బ్రహ్మోస్​.. ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా భారత్!

రణశక్తికి సాంకేతికత దన్ను.. చైనా సరిహద్దు వద్ద భారత్​ అప్రమత్తంగా ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.