ETV Bharat / jagte-raho

మీలో ఆశే.. సైబర్ నేరగాళ్లకు అవకాశం!

author img

By

Published : Oct 27, 2020, 8:46 AM IST

Updated : Oct 27, 2020, 9:30 AM IST

మీలో ఆశే.. సైబర్ నేరగాళ్లకు అక్షయపాత్ర!
మీలో ఆశే.. సైబర్ నేరగాళ్లకు అక్షయపాత్ర!

మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ఒకరు .. అతి తక్కువ ధరకే మీకు వస్తువులు విక్రయిస్తాం అని మరొకరు .. మేము ఇన్సురెన్స్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం ..మీరు కొంత నగదు చెల్లిస్తే మీ పాలసీని పునరుద్ధరిస్తామంటూ మరికొందరు ఫోన్లు చేసి మాయమాటలు చెబుతారు. ఆశపడి ఆకర్షితులైతే నిలువుదోపిడీ చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన దారుల్లో ఆన్​లైన్​లో నగదు దోచుకుంటున్న సైబర్ కిలాడీలపై కథనం.

ఒక్కోసారి ఆశ మనిషిని బలహీనపరుస్తుంటుంది. అదే సైబర్ నేరస్తుల పాలిట వరంగా మారుతుంది. అమాయకులకు నగదు ఎరవేసి మాయమాటలు చెప్పి బుట్టలో పడవేస్తారు. దశలవారీగా అందినకాడికి దోచుకుంటారు. ఏళ్లు గడుస్తున్నా మాయగాళ్లు తీరు మారలేదు. సైబర్ నేరం అంటే ముందు గుర్తొచ్చేది లాటరీ పేరుతో మోసాలు. ఆన్ లైన్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. నేరాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మీరు మా లక్కీ డిప్ లో లక్షల రూపాయలు గెలుచుకున్నారు. అని ఫోన్ చేస్తారు. మేం వెంటనే మీకు నగదు పంపుతున్నామని అడ్రస్ వివరాలు తీసుకుంటారు. తర్వాత ఫోన్ చేసి రకరకాల పేర్లతో దశల వారీగా అందిన కాడికి దోచుకుంటారు.

లక్కీ డ్రాలతో జాగ్రత్త

మీరు 10 వేల రూపాయలు నగదు పంపితే చాలు మీకు లక్షల రూపాయలు పంపిస్తామంటారు. మీకు అనుమానం వచ్చే వరకు మీ జేబును ఖాళీ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు చెపుతున్నారు. లాటరీ టిక్కెట్ కొనకుండా ఎలా లక్కీ డ్రాలో గెలుస్తారు. అన్న సందేహం ప్రతి ఒక్కరిలో రావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజంగా డ్రాలో గెలిస్తే టాక్స్ మినహాయించుకుని మిగిలిన నగదును ఇస్తారని.. పలు టాక్స్ ల పేరుతో డబ్బులు వసూలు చేయరని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ తరహాలోనే విజయవాడలో ఓ సైబర్ నిపుణుడికే ఈ సమస్య ఎదురైంది. కోటి రూపాయల లాటరీ గెలుచుకున్నారని ఫోన్ వచ్చింది. మీ వివరాలు పంపాలని కోరారు. వివరాలు పంపటంతో మేం మీ నగదు తీసుకుని ఎయిర్ పోర్ట్ కు వచ్చామని.. కస్టమ్స్ అధికారులకు టాక్స్ 30 వేల రూపాయలు చెల్లించాలని బ్యాంక్ ఖాతాలో వేయాలని కోరారు . లాటరీ నగదు లో మినహాయించి ఇవ్వండి అని బాధితుడు చెప్పటంతో మాట మార్చి.. నమ్మించేందుకు ప్రయత్నించాడని బాధితుడు చెప్పాడు. మరికొంత మంది ఫోన్ కు మెస్సేజ్ పంపి ఏపికే ఫైల్ ను పంపుతారు. వాటిని క్లిక్ చేస్తే మీఫోన్ నిందితుల కంట్రోల్ లోకి వెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రీమియం పేరుతో మోసం

సైబర్ నేరాల్లో మరోతరహా మోసం ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఎల్​ఐసీ,ఇన్సూరెన్స్ ల పేరుతో చాకచక్యంగా నగదు దోచుకుంటున్నారు. ముందుగా ఎల్​ఐసీ పాలసీదారుల వివరాలను నిందితులు సేకరిస్తున్నారు. ప్రీమియం కొన్నేళ్లుగా చెల్లించని వారి వివరాలు సేకరించి.. మేం ఎల్​ఐసీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ పాలసీ నెంబర్, మీ పేరు చెప్పి నమ్మిస్తారు. కొన్నేళ్లుగా ప్రీమియం చెల్లించటం లేదు. మీకు ఒక అవకాశమిస్తున్నామని మాయమాటలు చెబుతారు. కొంత మొత్తంలో నగదు చెల్లిస్తే మీ పాలసీని పునరుద్ధరిస్తామంటూ చెబుతారు. ఈ తరహాలోనే విజయవాడ భవానీపురానికి చెందిన సాయికి ఓ రోజు ఫోన్ వచ్చింది. ఐదేళ్ల కిందట నిలిపి వేసిన ఓ ఎల్​ఐసీ పాలసీని పునరుద్ధరించాలంటూ ఫోన్ చేశారు. సదరు బాధితుడు అనుమానం వచ్చి స్థానికంగా ఉన్న ఎల్​ఐసీ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదిస్తే .. అది అవాస్తవమని తేలింది . దీంతో బాధితుడు నివ్వెరపోయాడు. నగదు చెల్లించకపోవటంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే విధంగా ఇన్సూరెన్స్ ల పేరులతో వసూలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నేరుగా విక్రయదారుడినే కలవండి

సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే షాపింగ్ మాల్ కు వెళతాం.. కానీ ఈ కాలంలో అధిక శాతం ఆన్ లైన్ సైట్లపై ఆధారపడుతున్నాం. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేయాలంటే ఓఎల్ ఎక్స్ వెబ్ సైట్ ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్మీ అధికారుల పేరుతో నకిలీ ఫొటోలు, ఐడీలను వెబ్ సైట్ లో పొందుపరిచి అమాయకులను దోచుకుంటున్నారు.

ఇటీవల ఓఎల్ ఎక్స్​లో డిలక్స్ బైక్ ఫోటోలు పెట్టారు. అమ్మకం ధర 30 వేలు అన్నారు. అడ్రసు గన్నవరం విమానశ్రయంలో పనిచేసే సీఆర్పీఎఫ్ జవానుది చెప్పారు. పామర్రు మండలం కొండాయిపాలానికి చెందిన ప్రతాప్ అనే యువకుడు ఓఎల్ ఎక్స్ లో బైక్ చూసి ఫోను చేశాడు. బైక్ బుకింగ్ చేసుకోవాలంటే 1000 రూపాయలు గూగుల్ ఫే చేయాలని చెప్పాడు. సీఆర్పీఎఫ్ జవాను అని చెప్పటంతో ఏ మాత్రం అనుమానం రాలేదు. వెంటనే డబ్బులు గూగుల్ పే ద్వారా పంపాడు. రేపు ఉదయం ఎయిర్ పోర్టు కి వస్తే బైక్ చూపిస్తానని నిందితుడు నమ్మించటంతో .. బాధితుడు ఉదయం 9 గంటలకు విమానశ్రయం వచ్చి ఫోను చేశారు. నేను డ్యూటీ లో ఉన్నాను బయటకు రావటం కుదరదు. కరోనా వైరస్ ఉందని మా ఆఫీసర్ బయటకు పంపరు అని చెప్పాడు. బైక్ ఎయిర్ పోర్టు పార్కింగ్ లో ఉంది మీకు ఎటువంటి భయం అవసరం లేదు నన్ను నమ్మండి అని చెప్పాడు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నిసార్లు ఫోను చేసిన ఇలానే చెప్పాడు. బ్యాంకు ఎకౌంటు వివరాలు , ఆధార్ కార్డు వాట్సప్ పెట్టమని చెప్పాడు. బాధితుడికి అనుమానం వచ్చి ఎయిర్ పోర్టు అధికారులకు ఫొటో చూపి అడిగితే ఎవరు లేరు అని చెప్పారు. మళ్లి నిందితుడుకి ఫోను చేసి మేం పార్కింగ్ వద్దే ఉన్నామని అన్నారు. అసలు బైక్ ఉందా లేదా అని గట్టిగా డిమాండ్ చేయటంతో ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని రేపు ఉదయం బైక్ తీసుకువస్తానని వెయిటింగ్ ఛార్జ్ గా 2వేల రూపాయలు గూగుల్ పే చేయాలని చెప్పటంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరహా మోసాలు ఇప్పుడు 30 శాతం పెరిగాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వస్తువు కొనాలంటే వెబ్ సైట్ లో చూసుకుని నేరుగా విక్రయదారున్ని కలవాలని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆశే సైబర్ నేరస్తులకు అక్షయపాత్రగా మారుతుందని పోలీసులు అంటున్నారు. ఆన్ లైన్ లో విక్రయాలు చేసేటప్పుడు ..లాటరీ వచ్చిందని ఫోన్ వచ్చినపుడు వాటిని నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. నేరుగా కలిసిన తర్వాతే కొనుగోలు చేయాలంటున్నారు.

ఇదీ చదవండి: కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ

Last Updated :Oct 27, 2020, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.