'నిప్పుతో చెలగాటం వద్దు.. అది మీకే ప్రమాదం'.. అమెరికాకు జిన్​పింగ్ హెచ్చరిక

author img

By

Published : Jul 29, 2022, 12:45 PM IST

america warns china
అమెరికా చైనా అధ్యక్షుల చర్చలు ()

US WARNS CHINA TAIWAN: అమెరికా, చైనా అధినేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం ఇరుదేశాల నేతలు జోబైడెన్- జిన్​పింగ్​ మధ్య రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. వీరి చర్చల్లో ప్రధానాంశంగా 'తైవాన్' మారింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైపీని సందర్శించనున్నారనే వార్తలను దృష్టిలో పెట్టుకొని చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ పరుష వ్యాఖ్యలు చేశారు. దీనికి బదులుగా అమెరికా అధ్యక్షుడు సైతం దీటుగా సమాధానమిచ్చారు. తైవాన్ విషయంలో అమెరికా విధానం మారలేదని గుర్తు చేశారు.

US WARNS CHINA TAIWAN: అమెరికా- చైనా అధినేతల మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. గురువారం బైడెన్‌- జిన్‌పింగ్‌ మధ్య రెండున్నర గంటల సమావేశం సెగలు పుట్టించింది. ఇరు దేశాల మధ్య విభేదాలను ఈ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది. ఇరువురు నేతలు ముఖాముఖీ భేటీ కావడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఒక్కటే చెప్పుకోదగ్గ పరిణామం. తెరవెనుక అమెరికా ఏదో అనుమానిస్తోంది.. అందుకే ఇటీవల ఆ దేశం తీసుకొన్న నిర్ణయాలు చాలా వరకూ చైనాను దృష్టిలో పెట్టుకొనే ఉంటున్నాయి.

తైవాన్‌ విషయంలో తగ్గేదేలే..
అమెరికా- చైనా అధ్యక్షుల చర్చల్లో తైవాన్‌ ప్రధానాంశంగా మారింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైపీని సందర్శిస్తారనే వార్తలను దృష్టిలో పెట్టుకొని షీ జిన్‌పింగ్‌ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. "ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించకూడదు. ఒక వేళ మీరు నిప్పుతో చెలగాటం ఆడితో మీకే కాలుతుంది. అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా" అని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించినట్లు చైనా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు అమెరికా ఇంత కఠినంగా కాకపోయినా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. "తైవాన్‌ విషయంలో అమెరికా పాలసీ మారలేదన్న విషయాన్ని బైడెన్‌ గుర్తు చేశారు. కానీ, ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే తైవాన్‌ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరవడుతుంది" అని పేర్కొన్నట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. వీరి మధ్య ఆర్థిక సహకారం, ఉక్రెయిన్‌ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

అదే ఫైర్‌..
నిప్పుతో చెలగాటం.. కామెంట్లు చేయడం చైనా అధ్యక్షుడు షీజిన్‌ పింగ్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే మాట్లాడారు. చైనాకు చెందిన దౌత్యవేత్తలు కూడా తైవాన్‌ విషయంలో ఇదే వాక్యాన్ని తరచూ వాడుతుంటారు. ఇప్పుడు జిన్‌ పింగ్‌ వ్యాఖ్యలు దానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి.

వరుస నిర్ణయాలతో అమెరికా అప్రమత్తం..
నాన్సీ పెలోసీ తైపీలో పర్యటిస్తారనే వార్తలు గుప్పుమనడంతో అమెరికా అప్రమత్తమైంది. చైనాతో పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో వైపు పెలోసీ అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. చైనా హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా-చైనా మధ్య ఇది ప్రధాన వివాదంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకల మోహరింపు: పెలోసీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌, స్ట్రైక్‌ గ్రూప్‌ను సింగపూర్‌ పోర్టు నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి తరలించింది. అమెరికా నేవీ సెవన్త్‌ ఫ్లీట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

  • చైనా ప్రభుత్వ గూఢచర్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధికారులు హెచ్చరించారు. అణ్వాయుధాలకు సంబంధించిన కమ్యూనికేషన్లపై డ్రాగన్‌ దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు.

సెమీ కండెక్టర్ల తయారీ స్థిరీకరించడంపై: అమెరికాలో టెక్‌ సెక్టార్‌ పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా సెమీకండెక్టర్ల ఉత్పత్తిని స్థిరీకరించాలన్న బిల్లుపై ప్రతినిధుల సభలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. చైనా తయారీని నిలిపివేసినా, తైవాన్‌ ఎగమతులను అడ్డుకొన్నా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యక్తిగతంగా సమావేశమవుతారని యూఎస్ అధికార వర్గాలు తెలిపాయి. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత జిన్​పింగ్​తో ముఖాముఖి ఇప్పటివరకు కలవలేదు. ఇరుదేశాల మధ్య సామరస్య పూర్వక వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశాయి యూఎస్ అధికార వర్గాలు.

ఇవీ చదవండి: 'ప్రధానిగా నన్ను ఎన్నుకుంటే.. లైంగిక నేరస్థుల అంతుచూస్తా'

'ఇక అణ్వాయుధాలతోనే జవాబు!'.. ఆ దేశాలకు కిమ్ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.