ETV Bharat / international

బ్రిటన్​ ప్రధాని పోరులో రిషి సునాక్​ వెనుకంజ..!

author img

By

Published : Sep 2, 2022, 4:02 PM IST

liz truss rishi sunak
లిజ్​ ట్రస్ రిషి సునాక్‌

బ్రిటన్‌ ప్రధాని ఎన్నికకు హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి విజేత ఎవరనే దానిపై కొంత స్పష్టత వచ్చింది. లిజ్​ ట్రస్ ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రిషి సునాక్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rishi Sunak Trailing : బ్రిటన్‌లో ప్రధాని ఎంపిక కోసం కన్జర్వేటివ్‌ పార్టీలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారం ముగిసేనాటికి విజేత ఎవరనే దానిపై కొంత స్పష్టత వచ్చింది. లిజ్‌ ట్రస్‌ ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఆమెతో పోలిస్తే రిషి సునాక్‌ కొంత వెనుకంజలో ఉన్నారు. శుక్రవారంతో కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల ఓటింగ్‌ కూడా ముగియనుంది. పోటీలో ఉన్న ఇద్దరు అగ్రనేతలు ముమ్మర ప్రచారం చేసుకోగా.. బుధవారం వారిద్దరి మధ్య చివరి డిబేట్‌ జరిగింది. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రిషి సునాక్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం తన రాజీనామాను క్వీన్‌ ఎలిజిబెత్‌-2కు సమర్పించకముందే ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

దాదాపు 2,00,000 మంది సభ్యులున్న టోరిలో ఆగస్టు నుంచి పోస్టల్‌, ఆన్‌లైన్‌ విధానంలో ఓటింగ్‌ జరుగుతోంది. ఆ ఓటింగ్‌ సెప్టెంబర్​ 2న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీనిలో లిజ్‌ట్రస్‌ మంచి మెజార్టీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విజేతలు బ్రిటన్‌ రాణి అనుమతితో ప్రధాని పదవి చేపట్టనున్నారు.
కొత్త ప్రధానికి బ్రిటన్‌లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి రష్యా యుద్ధం కూడా తోడుకావడంతో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాను అధికారం చేపడితే పన్నులను గణనీయంగా తగ్గిస్తానని ఇప్పటికే ట్రస్‌ హామీ ఇచ్చారు. కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టేవారి పాలన ఆధారంగా కన్జర్వేటివ్‌ పార్టీ 2025లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వారి స్ఫూర్తివల్లే రాజకీయాల్లోకి: బ్రిటన్‌ ప్రధాని ఎన్నికకు హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. పోటీలో ఉన్న ఇద్దరు అగ్రనేతలు ముమ్మర ప్రచారం చేసుకోగా.. బుధవారం వారిద్దరి మధ్య చివరి డిబేట్‌ జరిగింది. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రిషి సునాక్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తే కారణమన్న ఆయన.. తన ప్రయాణంలో ఎంతో మద్దతుగా నిలిచిన ఆయన సతీమణి అక్షతా మూర్తికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ ముగింపు సమావేశం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ప్రజాసేవలోకి వచ్చేందుకు నాకు స్ఫూర్తినిచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడే ముందు వరుసలో కూర్చున్నారు.. అంటూ రిషి సునాక్‌ తన తల్లిదండ్రులు యశ్వీర్‌ (వైద్యుడు), ఉషా (ఫార్మసిస్ట్‌)లను చూపించారు. ప్రజల కోసం వారు చేసిన సేవే తాను రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మీకంటే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ వేదికపై నుంచి ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. ఇక తనను అమితంగా ప్రేమించే తన భార్య అక్షతా మూర్తి (ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి కుమార్తె) గురించి మాట్లాడిన రిషి.. సంపన్న కుటుంబాన్ని వదులుకొని సాధారణ జీవితంలోకి రావడం ఎంతో గొప్ప విషయమన్నారు.

చర్చలో భాగంగా టోరి సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు రిషి సునాక్‌ సమాధానమిచ్చారు. ప్రధానిగా పోటీ చేస్తోన్న క్రమంలో మీరు ఏం త్యాగం చేయాల్సి వచ్చిందని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. గత రెండేళ్లుగా ఓ భర్తగా, ఓ తండ్రిగా వారికి తగినంత సమయం కేటాయించలేకపోయానన్నారు. ఈ క్రమంలో తన సతీమణి అక్షతా మూర్తి ఎంతో తోడుగా నిలిచిందన్నారు. ఏదేమైనా దేశసేవలో భాగంగా వచ్చిన ఈ అవకాశాన్ని గొప్పగా భావిస్తున్నానని.. ఇందుకు కుటుంబంతోపాటు తన మద్దతుదారుల నుంచి భారీ స్పందన రావడం నిజంగా అదృష్టమని రిషి సునాక్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి : ఎన్నికల ఫ్రాడ్​ కేసులో సూకీకి మూడేళ్ల జైలు శిక్ష.. శ్రీలంకకు గొటబాయ రాజపక్స!

50 వేల మందితో రష్యా సైనిక విన్యాసాలు.. అమెరికా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.