Pakistan Wheat Crisis : ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. నిత్యవసరాల సరకులు సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. జీతాల్లో కోతలు విధిస్తూ.. నిత్యవసరాల ధరలను అదుపుచేయలేక కొట్టుమిట్టాడుతుంది పాక్. దేశంలోని అనేక ప్రాంతాల్లో గోధుమల కొరత ఏర్పడి పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఘోరమైన పిండి సంక్షోభం ఏర్పడి అనేక చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. పిండిని దక్కించుకునేందుకు ప్రజలు రోజు అనేక గంటల పాటు రోడ్లపైనే వేచిచూస్తున్నారు. సాయుధ దళాలు పంపిణీ చేస్తున్న పిండి వాహనల చుట్టూ ప్రజలు ఎగబడుతున్నారు.
పాక్లో విపరీతంగా పెరిగిన పిండి ధరలు
- కిలో గోధుమలు కరాచిలో రూ.140-160
- ఇస్లామాబాద్లో 10 కేజీల పిండి బ్యాగ్ రూ.1,500
- పెషావర్లో 10 కేజీల పిండి బ్యాగ్ రూ.1,500
- ఖైబర్ పక్తున్ఖ్వాలో 20కిలోల పిండి బ్యాగ్ రూ.3,100
- పంజాబ్ ప్రావిన్స్లో 20కేజీల పిండి రూ.2,800
"పాక్లో పిండి నిల్వలు పూర్తిగా అయిపోయాయి. తమకు తక్షణమే 4 లక్షల గోధుమ పిండి బస్తాలు అవసరం. లేకపోతే మరింత సంక్షోభం పెరిగే అవకాశం ఉంది"
- జమరాక్ అచక్జాయి, బలూచిస్థాన్ ఆహార శాఖ మంత్రి
నిత్యవసరాల్లో ప్రధానమైన పిండిని సంపాదించడం కోసం పేదలతో పాటు ధనికులు పడరాని పాట్లు పడుతున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. సింధ్ ప్రభుత్వం సబ్సిడీ పిండిని పంపిణీ చేస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందాడు. షాహీద్ బెనజీరాబాద్లోని సక్రంద్ పట్టణంలోని జరిగిన మరో తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఒక బాలిక గాయపడ్డారని పాకిస్థాన్ మీడియా తెలిపింది.
ది న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక ఇచ్చిన సమాచారం ప్రకారం.. గత రెండేళ్లుగా దేశంలో అన్ని ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగినప్పటికీ.. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాక్లో పిండి సంక్షోభం రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ప్రధాన కారణం. ఎంత గోధుమలను దిగుమతి చేసుకోవాలో పంజాబ్ ఆహార శాఖ సరిగ్గా అంచనా వేయలేక ఇంతటి సంక్షోభానికి దారితీసిందని చెప్పింది.
ఇవీ చదవండి:
సూయిజ్ కాలువలో చిక్కుకున్న నౌక.. కాసేపటికే..
రిషి సునాక్ సహా 15 మంది మంత్రులకు ఓటమి తప్పదా..? సర్వేలో వెల్లడి