100 మంది పౌరుల ఊచకోత- పాక్​ నేతల ఆదేశాలతోనే!

author img

By

Published : Jul 23, 2021, 12:16 PM IST

talibans in afghan
అఫ్గాన్ తాలిబన్లు ()

అఫ్గానిస్థాన్​లో 100 మందికిపైగా పౌరులను ఓ సాయుధ మూక హత్య చేసింది. ఇది కచ్చితంగా.. తాలిబన్ల పనేనని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. తమకు, దీనికి ఏ సంబంధం లేదని తాలిబన్లు చెప్పారు.

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. ఆ దేశంలో హింసాత్మక ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కాందహార్​ రాష్ట్రంలోని స్పిన్​ బోల్దాక్​ జిల్లాలో 100 మందికిపైగా పౌరులను ఓ సాయుధ మూక హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇది కచ్చితంగా తాలిబన్ల చర్యేనని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

"పాకిస్థాన్​లో ఉన్న తమ నాయకుల ఆదేశాలతో స్పిన్ బోల్దాక్​లో అఫ్గాన్ తాలిబన్లు.. అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎన్నో ఇళ్లను వారు దోచుకున్నారు. 100 మందికి పైగా పౌరులను బలిగొన్నారు. ఈ చర్యతో వారి అసలు క్రూర స్వరూపం ఏంటో బయటపడింది."

- అఫ్గాన్​ అంతర్గత మంత్రిత్వ శాఖ

గతవారం స్పిన్ బోల్దాక్​ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అక్కడి ఇళ్లను వారు దోచుకోవడమే కాకుండా.. ప్రభుత్వ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఓ వీడియోను ఫ్రాన్స్ 24 సంస్థ విడుదల చేసింది. పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​తో సంబంధాలు నెరిపేందుకు వీలుగా ఉండే ఈ ప్రాంతంలో.. తాలిబన్లు తమ బైకులపై తిరుగుతూ ఇళ్లను దోచుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. కొన్ని ఇళ్లపై తాలిబన్లు తమ జెండాను కూడా ఎగురవేసినట్లుగా కనిపించింది.

నేలపై మృతదేహాలు..

బక్రీద్​ పండగకు ఒక్కరోజు ముందు తను కుమారులిద్దరినీ ఇంటి నుంచి కొంత మంది గుర్తు తెలియని సాయుధులు అపహరించుకుని వెళ్లారని స్పిన్ బోల్దాక్​ ప్రాంతానికి చెందిన ఫిదా మహమ్మద్ అఫ్గాన్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వారు తాము తాలిబన్లము కాదని చెప్పారని తెలిపారు. అయితే.. వారు ఎవరైనా తమ కుమారులను విడిచిపెట్టి న్యాయం చేయాలని కోరారు.

స్పిన్​ బోల్దాక్​లో నేలపై పడి ఉన్న మృతదేహాలు కనిపిస్తున్నాయని అఫ్గాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. మరోవైపు... తాము పౌరులు ఎవరినీ చంపలేదని తాలిబన్లు చెబుతూ ఉండటం గమనార్హం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.