ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల కరోనా కేసులు.. డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక

author img

By

Published : Jan 9, 2022, 10:59 AM IST

Worldwide corona update: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కారణంగా అమెరికా, ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల్లో కొవిడ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు అమలు చేయాలని, ఒమిక్రాన్​ను తేలికగా తీసుకొవద్దని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ).

Worldwide corona cases updates
Worldwide corona cases updates

Worldwide corona update: అంతర్జాతీయంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కారణంగా వివిధ దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 22,17,682 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వైరస్​ కారణంగా ఐదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా కొవిడ్​ నుంచి బయటపడ్డారు. వైరస్​ వ్యాప్తి కట్టడికి ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కొవిడ్​ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి.

  • అమెరికాలో గడిచిన రెండు మూడు రోజులతో పోల్చుకుంటే రోజువారి కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించింది. శనివారం 4.68 లక్షల మందికి వైరస్​ సోకగా.. 669 మంది చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా మూడు లక్షలకుపైగా కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 142 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో తాజాగా 1 లక్షల 46 వేల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరో 313 మంది మృతి చెందారు.
  • రష్యాలో కొవిడ్​ కేసులు తక్కువగానే నమోదవుతున్నప్పటికీ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా 16,568 కేసులు నమోదవగా.. 796 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో తాజాగా 1,97,552 మంది కరోనా సోకింది. 184 చనిపోయారు.
  • అర్జెంటీనాలో ఒక్కరోజే 1,01,689 కేసులు వెలుగుచాశాయి.37 మంది చనిపోయారు.

ఐసోలేషన్​కు నేపాల్​ ప్రధాని

నేపాల్​ ప్రముఖ రాజకీయ నేత పుష్పకమల్​ దహల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి షేర్​ బహదూర్​ దేవుబా ఐసోలేషన్​లోకి వెళ్లారు. కాగా ఆ దేశంలో శనివారం 944 మందికి వైరస్ సోకింది.

ఆస్ట్రేలియా మాజీ ప్రధానికి కొవిడ్

ఆస్ట్రేలియాలోనూ కరోనా విలయం సృష్టిస్తోంది. ఆ దేశ మాజీ ప్రధాని మాల్కం టర్న్‌బుల్​ కూడా కొవిడ్​ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆ దేశంలో ఒక్కరోజే లక్షా 15 వేల మందికి కొవిడ్​ సోకగా.. 25 మంది చనిపోయారు. వాస్తవంగా ఈ​ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రొమేనియాలో కఠిన ఆంక్షలు

మరో కొవిడ్​ వేవ్ రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది రొమేనియా సర్కారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. గడిచిన వారం రోజులుగా రోజువారి కేసులు 6000కుపైగా నమోదవుతున్న నేపథ్యంలో కొవిడ్​ నిబంధనలకు ఉపక్రమించారు అక్కడి అధికారులు.

'కఠిన చర్యలు అమలు చేయండి'

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్ర రూపం దాల్చిన తరుణంలో.. ప్రజారోగ్య, సామాజిక చర్యలను కఠినంగా అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పిలుపునిచ్చింది. అలాగే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉందని.. తేలికపాటిదేనని కొట్టిపారేయడానికి లేదని హెచ్చరించింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి: ఒమిక్రాన్‌ వేళ.. అక్కడ ఐదేళ్లలోపు పిల్లల్లో భారీగా ఆసుపత్రి చేరికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.