ETV Bharat / entertainment

కొత్తదారిలో.. నవతరం.. కానీ కొందరికే విజయం

author img

By

Published : Dec 18, 2022, 6:54 AM IST

చిత్రసీమపై యువ కథానాయకుల ప్రభావం ఎక్కువే. వసూళ్లు... రికార్డుల విషయంలో అగ్ర తారలు ముందుండొచ్చు కానీ... వారం వారం సందడి చేసేది మాత్రం యువ తారలే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేంత వేగం వాళ్లలో ఉంటుంది. థియేటర్ల దగ్గర అగ్ర తారల సినిమాల స్థాయిలోనే సందడి కనిపిస్తుంటుంది. మరి 2022లో యువతారల హవా ఎలా సాగిందో చూద్దాం...

ciniema
నవతరం

అగ్ర కథానాయకుడు అనగానే ఇమేజ్‌, రికార్డులు, మార్కెట్టు, అంచనాలు... ఇలా బోలెడన్ని లెక్కలు. ఆ లెక్కల నుంచే కథలు పుడుతుంటాయి. కానీ యువ కథానాయకులకి ఆ బంధనాలేవీ ఉండవు. ఓ కొత్త రకమైన కథని స్వీకరించాలన్నా... తెరపై ఓ కొత్త రకమైన పాత్రలో కనిపించాలన్నా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రేక్షకులకి కొత్త అనుభవాన్ని పంచే సినిమాల్ని ఇవ్వడంలో ముందు వరసలో ఉంటూ అప్పుడప్పుడూ అద్భుతాల్ని సృష్టిస్తుంటారు. పొరుగు పరిశ్రమల్లోనూ స్ఫూర్తిని నింపుతున్న మన కథానాయకులు ఈసారీ కొత్తగా అడుగులు వేయడానికే ప్రయత్నం చేశారు.

కల్యాణ్‌రామ్‌, నాని, రానా, శర్వానంద్‌... కథల ఎంపికలో ఈ కథానాయకుల అభిరుచులే వేరు. అప్పుడప్పుడూ ఎదురు దెబ్బలు తగిలినా సరే... వెనకడుగు వేయకుండా ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథని ఎంచుకుంటుంటారు. అందుకే వీళ్ల సినిమా అంటే ఓ మంచి కథ ఉంటుందనే భరోసా ప్రేక్షకులది. ఆ అంచనాల్ని అటు కథానాయకుడిగానూ, ఇటు నిర్మాతగానూ నిజం చేస్తున్నారు నాని. గతేడాది 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కేసిన నాని... ఈసారి 'అంటే... సుందరానికి!' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరోసారి రొమాంటిక్‌ కామెడీ కథతో చేసిన ఈ సినిమాతో ఆయనకి విజయం దక్కలేదు కానీ, తన శైలి వినోదాన్ని పంచారు. నిర్మాతగా చేసిన 'హిట్‌ 2' సినిమాతో మాత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కొత్త ప్రయత్నాలు చేయడంలో ఏమాత్రం రాజీపడని కల్యాణ్‌రామ్‌ ఈసారి పాంటసీ కథతో రూపొందిన 'బింబిసార'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

new heros
నవతరం

రెండు కోణాల్లో సాగే పాత్రలో ఆయన నటన, సొంత నిర్మాణ సంస్థలో ఆయన చేసిన ఈ ప్రయత్నంపై అభినందనలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది 'అమిగోస్‌', 'డెవిల్‌' చిత్రాలతో సందడి చేయనున్నారు. మరో కథానాయకుడు రానా దగ్గుబాటి ఈ ఏడాది కూడా తనదైన ప్రభావం చూపించారు. 'భీమ్లానాయక్‌'తో డేనియల్‌ శేఖర్‌గా ఆయన చేసిన సందడి ఆకట్టుకుంది. 'విరాటపర్వం'తో మరోసారి తన అభిరుచిని చాటి చెప్పారు. అందులో రవన్నగా ఆయన నటన గుర్తుండిపోతుంది. శర్వానంద్‌కి ఈసారి మిశ్రమ ఫలితాలు లభించినా, కథల ఎంపికలో ఆయన ప్రత్యేకతని మరోసారి చాటి చెప్పారు. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' స్వచ్ఛమైన కుటుంబ వినోదం అందించినా ఫలితం మాత్రం పెద్దగా రాలేదు. టైమ్‌ మిషన్‌ నేపథ్యంలో సాగే 'ఒకే ఒక జీవితం' మాత్రం ఆయనకి గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. కథల ఎంపికలో విజయ్‌ దేవరకొండ కూడా ప్రత్యేకమే. 'లైగర్‌'తో ఈసారి పాన్‌ ఇండియా మార్కెట్‌పై గురిపెట్టారు. ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఆయన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షించారు. కానీ సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు.

nagasavrya
నాగశౌర్య

పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తున్న వేళ... మన యువ తారలు సత్తా చాటారు. పొరుగు పరిశ్రమల్లోని కథానాయకులకి కూడా స్ఫూర్తిని నింపిన ఆ కథానాయకులు అడివి శేష్‌, నిఖిల్‌. వరుసగా విజయాలు సాధిస్తున్న అడివి శేష్‌ ఈ ఏడాది కూడా తన హవా కొనసాగించారు. 'మేజర్‌' చిత్రంతో ఆయన పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాతో అడివి శేష్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. దేశభక్తి, భావోద్వేగాలు, యాక్షన్‌ మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇటీవలే విడుదలైన 'హిట్‌2'తోనూ విజయాల పరంపరని కొనసాగించారు. ఎస్పీ కేడీగా ఆయన నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. మరో యువ కథానాయకుడు నిఖిల్‌ 'కార్తికేయ2'తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించారు. కృష్ణతత్వం నేపథ్యంలో సాగే ఆ సినిమా కథానాయకుడిగా నిఖిల్‌ స్థాయిని పెంచింది. '18 పేజెస్‌'తో ఈ నెలలో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈసారి ఆయన ఓ ప్రేమకథతో మాయ చేయబోతున్నారు.

నాగచైతన్య ఈ ఏడాది ఆరంభంలో 'బంగార్రాజు'గా సందడి చేశారు. చిన బంగార్రాజుగా ఆయన హంగామా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన ఆయన సినిమాలు 'థ్యాంక్యూ', 'లాల్‌ సింగ్‌ చద్దా' పరాజయాన్ని చవిచూశాయి. ఆమిర్‌ఖాన్‌తో కలిసి చేసిన 'లాల్‌ సింగ్‌ చద్దా' ఆయన్ని హిందీ మార్కెట్‌కి దగ్గర చేస్తుందనే ఆశ ఫలితంతో నీరుగారిపోయింది. వరుణ్‌తేజ్‌ 'ఎఫ్‌3'తో మరోసారి నవ్వించినా, ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి సినిమా స్థాయిలో ఆయనకి ఫలితాన్ని తీసుకురాలేదు. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన 'గని' కూడా పరాజయాన్నే మిగిల్చింది. ఈ సినిమాకోసం ఆయన శారీరకంగా, మానసికంగా ప్రత్యేకంగా సన్నద్ధమైనా కథ, కథనాల్లో బలం లేకపోవడంతో సరైన ఫలితం దక్కలేదు. మరో యువ కథానాయకుడు నాగశౌర్య ఈసారి 'కృష్ణ వ్రింద విహారి'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సొంత సంస్థలో చేసిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. సాయిధరమ్‌ తేజ్‌, అఖిల్‌ అక్కినేని తదితర కథానాయకులు ఈసారి తెరపై సందడి చేయలేదు. తొలి సినిమాతో ఆకట్టుకున్న వైష్ణవ్‌తేజ్‌ ఈసారి 'రంగ రంగ వైభవంగా' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చినా ఫలితం దక్కలేదు.

ఇవీ చదవండి: థియేటర్​లో సినిమా టికెట్లు అమ్మిన హీరోయిన్​.. ఎగబడ్డ కుర్రాళ్లు!

జక్కన్న నెక్ట్స్​ భారీ స్కెచ్​.. ప్రభాస్​-ఎన్టీఆర్​ కాంబోలో పవర్​ఫుల్ మల్టీస్టారర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.