సోమవారం నుంచి సినిమా షూటింగ్​లు​ బంద్​

author img

By

Published : Jul 31, 2022, 3:15 PM IST

Updated : Jul 31, 2022, 8:00 PM IST

shooting stopsshooting stops

తెలుగు సినీ పరిశ్రమలో సోమవారం నుంచి రెడీ, కెమెరా, యాక్షన్ మాటలకు బ్రేక్ పడనుంది. సినిమా షూటింగ్‌లు నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ఆదివారం ప్రకటించింది. నిర్మాణ వ్యయం, ఓటీటీలకు కొత్త సినిమాలు ఇవ్వడం, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లతో సతమతమవుతున్న నిర్మాతలు చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Telugu Cinema Shooting Bandh: చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశంలో నిర్ణయించారు. గిల్డ్‌ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్‌ మద్దతు తెలిపింది. టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదలపై చర్చే ప్రధాన అజెండాగా తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు షూటింగ్​లు నిలిపివేస్తామని ప్రముఖ నిర్మాత దిల్​రాజు తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న వాటికి కూడా బ్రేక్​ ఇస్తామని ఆయన చెప్పారు. సినిమా చిత్రీకరణలను కొన్ని రోజులు ఆపాలని నిర్ణయించినట్లు తెలుగు ఫిలిం ఛాంబర్‌ నూతన అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనుకుంటున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మేల్కోకపోతే ఇండస్ట్రీ మనుగడ ప్రమాదంలో పడిపోతుందని గ్రహించారు. ఈ మేరకు నష్టనివారణ చర్యలు మొదలుపెట్టారు. అందుకోసం చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలుగు నిర్మాతలు నిర్ణయించారు. సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడం, ఓటీటీలకు ప్రేక్షకులు అలవాటు పడటంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరమైనట్లు నిర్మాతలు భావిస్తున్నారు. కొత్త సినిమాలు రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల కావడమూ నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. చిన్న,పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా టికెట్ ధరలను పెంచడం వల్ల కూడా ప్రేక్షకులు ఓటీటీలపై దృష్టి పెట్టినట్లు గుర్తించారు.

సమస్యల పరిష్కారానికి 36 మందితో కమిటీ.. అంతకుముందు.. ఆదివారం ఉదయం తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి రెండు ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ పోటీ పడ్డారు. 42 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమస్యల పరిష్కారానికి 36 మందితో ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ... ఆగస్టు 2న సమావేశం కానుంది. వారం నుంచి రెండు వారాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు.

దాదాపు 30 సినిమాల షూటింగ్​కు బ్రేక్​.. సోమవారం నుంచి షూటింగ్‌ల నిలిపివేతతో నిర్మాణంలో ఉన్న దాదాపు 30 వరకు పెద్దచిన్న సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోనున్నయాయి. దీనివల్ల నిర్మాతలకు నష్టమైనప్పటీకీ... అందరూ షూటింగ్‌ల బంద్‌కే ఏకగ్రీవంగా నిర్ణయించారు. చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌', ప్రభాస్​ 'ప్రాజెక్ట్‌ కె', 'సలార్‌', విజయ్‌ దేవరకొండ 'ఖుషి', విజయ్‌ 'వారసుడు', రవితేజ 'రావణాసుర', నాని 'దసరా', రామ్​చరణ్‌-శంకర్‌ సినిమా, అఖిల్‌ 'ఏజెంట్‌' వంటి సినిమాల చిత్రీకరణ ఆగనున్నాయి.

ఇవీ చదవండి: 'బింబిసార 2'లో ఎన్టీఆర్‌!.. హీరో కల్యాణ్​రామ్‌ క్లారిటీ

కొత్త బిజినెస్​లోకి మహేశ్!​.. మరి ఈ స్టార్స్​ ఏఏ వ్యాపారాల్లో రాణిస్తున్నారంటే?

Last Updated :Jul 31, 2022, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.