ETV Bharat / entertainment

రజనీ చిత్రంలో మోహన్‌లాల్.. అజిత్​ మూవీలో విలన్​గా స్టార్ హీరో.. సెట్​లో శ్రీలీల సందడి!

author img

By

Published : Jan 7, 2023, 7:06 AM IST

Etv Bharat
Etv Bharat

సూపర్​ స్టార్​ రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'జైలర్​'. ఈ సినిమాలో ఇప్పటికే పలువురు స్టార్​ ఆర్టిస్టులు ఉండగా ఈ టీమ్​లో ఇంకో స్టార్​ హీరో రానున్నారట. మరోవైపు అజిత్​ విఘ్నేశ్​ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో ఓ స్టార్​ హీరో విలన్​గా నటించనున్నారట.

రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'జైలర్‌'లో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించనున్నారా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. 'బీస్ట్‌' ఫేమ్‌ నెల్సన్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా 'జైలర్‌' రూపొందుతోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. రమ్యకృష్ణ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఇందులో ఇప్పటికే ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌లాల్‌ కూడా ఓ చిన్న పాత్రలో సందడి చేయనున్నారని, ఈ నెలలోనే ఆయన 'జైలర్‌' సెట్లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజిత్‌ కోసం విలన్‌గా..
ఈ సంక్రాంతికి 'తెగింపు'తో బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్నారు కథానాయకుడు అజిత్‌. దీని తర్వాత ఆయన విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా.. పండగ తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఇతర నటీనటుల్ని ఖరారు చేసే పనిలో ఉంది చిత్ర బృందం.

ఇందులో భాగంగా ఇప్పుడీ సినిమా కోసం ప్రతినాయకుడిగా అరవింద్‌ స్వామిని ఖరారు చేశారని సమాచారం. ఈ సినిమాకి ఆయన పాత్ర ఓ మూలస్తంభంలా ఉంటుందని.. కథలో తన పాత్రకున్న ప్రాధాన్యత నచ్చి సినిమాకి ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్‌ 29ఏళ్ల క్రితం అరవింద్‌ స్వామితో కలిసి 'పాసమలర్‌గల్‌' (1994)లో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ కలయికలో ఓ చిత్రం రానుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి.

తుది దశలో కస్టడీ
నాగచైతన్య కథానాయకుడిగా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'కస్టడీ'. కృతిశెట్టి కథానాయిక. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ శుక్రవారం మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. "నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రమిది. సాంకేతిక హంగులు, నిర్మాణంలో ప్రమాణాలు మరో స్థాయిలో ఉంటాయి. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా నటిస్తుండగా, ప్రియమణి శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నార"ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం వేసవిని పురస్కరించుకుని మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయోత్సాహంతో సెట్లోకి అడుగులు
చేతి నిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి శ్రీలీల. వరస అవకాశాలతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఇటీవలే 'ధమాకా'తో తొలి కమర్షియల్‌ హిట్‌ను అందుకున్న ఈ నాయిక ఇప్పుడు కథానాయకుడు రామ్‌ చిత్రం కోసం రంగంలోకి దిగింది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

తాజాగా ఈ చిత్ర సెట్లోకి శ్రీలీల అడుగు పెట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. రామ్‌, శ్రీలీలకు మధ్య సాగే కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది. "అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రామ్‌ మాస్‌ పాత్రలో సరికొత్తగా కనిపిస్తారు" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.