ETV Bharat / city

CBN: ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?: చంద్రబాబు

author img

By

Published : Feb 11, 2022, 5:24 PM IST

Updated : Feb 12, 2022, 4:08 AM IST

సినీ పరిశ్రమలో సమస్య సృష్టించి, మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్లుు వ్యవహరిస్తున్న సీఎం జగన్ తీరు ఊహకందనిదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. అనేక అబద్ధాలు చెప్పిన జగన్.. తాను అసమర్థుడనని ఒప్పుకుని, సీఎంగా తప్పుకుంటే రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఎవరేం చేశారో తేల్చేందుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని జగన్​కు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం 9 బడ్జెట్లు ప్రవేశపెట్టాక కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు, హక్కులను సాధించలేకపోయిందన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ధైర్యం ఉంటే సీఎం జగన్ ఆ పని చేయగలరా ?
ధైర్యం ఉంటే సీఎం జగన్ ఆ పని చేయగలరా ?

ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా జగన్ మోసగించిన తీరు ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలను కోరారు. తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. సినీ పరిశ్రమపై సీఎం జగన్ కక్షకట్టి బ్లాక్​మెయిల్ చేస్తున్నారన్నది నిన్నటి సినీ పెద్దల మాటలతో స్పష్టమైందన్నారు. వివిధ వర్గాల పొట్ట కొట్టిన జగన్.. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. బరి తెగించిన వైకాపా నేరగాళ్లు ఉగ్రవాదులను మించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నేరగాళ్లు రాజ్యమేలితే ఇలానే ఉంటుందన్న చంద్రబాబు.. 2019 వరకు తమ జీవన ప్రమాణాలేంటి ?, ప్రస్తుతమేంటనేది ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు.

అశోక్ బాబు చేసిన తప్పేంటి..?
ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు క్విడ్ ప్రోకోలో భాగమేనని చంద్రబాబు ఆరోపించారు. అశోక్ బాబుపై ఫిర్యాదు చేసిన మెహర్ కుమార్ సోదరుడి భార్యకు బ్రాహ్మణ కార్పొరేషన్​లో నామినేటడ్ పదవి కట్టబెట్టారని వివరాలను బయటపెట్టారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న వారి పక్షాన నిలవటమే అశోక్ బాబు చేసిన తప్పా ? అని చంద్రబాబు నిలదీశారు. ఎమ్మెల్సీ నామినేషన్​లోనూ అశోక్ బాబు తన విద్యార్హత ఇంటర్మీడియట్ అనే పేర్కొన్నారన్నారు. టైపింగ్ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంతలా కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. అంగన్​వాడీలకు రూ.1000 ఇచ్చి మొత్తం తానే ఇచ్చినట్లుగా జగన్ రెడ్డి చెప్పుకుంటున్నాడని విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి మోసగించారని దుయ్యబట్టారు. ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని ఎవరు రెచ్చగొట్టి మోసగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పేదలు నిరుపేదలవుతున్నారు..
రాష్ట్రంలో సంపద సృష్టించకుండా దిల్లీ వెళ్లి బీద అరుపులు అరిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా? అని చంద్రబాబు నిలదీశారు. ప్రతీ వ్యక్తిపై రూ.లక్ష, ప్రతీ కుటుంబంపై రూ.5 లక్షల వరకూ అప్పు భారం మోపారని ధ్వజమెత్తారు. పార్కులు, కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినవారు ఇక రోడ్లు, ప్రైవేటు ఆస్తులు కూడా తాకట్టు పెడతారని దుయ్యబట్టారు. జగన్ చేసే అప్పులు ఆకాశం నుంచి వచ్చి ఎవ్వరూ కట్టరన్న చంద్రబాబు.., రేపు ప్రజలే కట్టాలని హెచ్చరించారు. వైకాపా నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారని వాపోయారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్​ను చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అర్థిక అంశాలపై సీఎం జగన్ ప్రసంగాలు, కేంద్ర స్పందనలకు సంబంధించిన పలు వీడియోలను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు.

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు..
రాష్ట్రంలో ఫ్యాన్ అధికారంలోకి వచ్చి విద్యుత్ కష్టాలను తీసుకొచ్చిందని చంద్రబాబు విమర్శించారు. 32 నెలల్లో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.11 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.26,261 కోట్లను పక్కదారి పట్టించారన్నారు. రూ.3 వరకు అందుబాటులో ఉన్న యూనిట్ సోలార్ విద్యుత్​ను కాదని కమీషన్ల కోసం రూ.15 కు కొంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ మోసకారి తనాన్ని ప్రజలు ఆనాడు అర్థం చేసుకోలేకపోవటం వల్ల రాష్ట్రం భ్రష్టు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర వాటా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు.

ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతోంది.. ?
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలోనే పెట్రోల్, గ్యాస్, లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోందని నిలదీశారు. రూ. 2 లక్షల కోట్ల విలువ చేసే అమరావతిని నాశనం చేసినందున రాజధాని ఎక్కడ ఉందో చెప్పలేని దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు ఇప్పటికీ హైదరాబాద్ రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. విభజన చట్టం వల్ల ఏపీకి నష్టం జరిగిందన్న చంద్రబాబు.., విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను ఎత్తేయటంతో పాటు రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని విమర్శించారు. కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర వాటా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు.

మా రాజధాని హైదరాబాద్‌ అని చెప్పే దుస్థితి
‘అమరావతిని నాశనం చేసి.. రాజధాని ఎక్కడో చెప్పలేని స్థితికి తెచ్చారు. మా రాజధాని హైదరాబాద్‌ అని చెప్పే దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారు. తనపై ఉన్న కేసుల మాఫీ, మళ్లీ జైలుకు పోకుండా ఉండేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. కరెంటు కోతలు విధిస్తున్నారు. ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,611 కోట్ల భారం వేశారు. ఇది మీ అసమర్ధత, చేతకానితనం కాదా? పంటలన్నీ నాశనమై రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకపోవడం చూస్తుంటే.. రాష్ట్రంలో వ్యవసాయశాఖను ఎత్తేసినట్లుంది. అయిదేళ్ల తెదేపా పాలనలో ఎప్పుడైనా ఎరువుల కొరత మాట విన్నారా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు, ముఖ్యమంత్రి అయ్యాక వివిధ అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.

తెదేపా హయాంలోనే మెరుగైన జీతాలు, వసతులు
‘2014లో రూ.22వేల కోట్ల రెవెన్యూలోటు ఉన్నా.. అశోక్‌బాబు నాయకత్వంలో అందరూ అడిగితే 43% ఫిట్‌మెంట్‌, 30% హెచ్‌ఆర్‌ఏ ఇచ్చాం. పదవీవిరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. ఉద్యోగులకు తెదేపా హయాంలోనే మెరుగైన జీతాలు, వసతులు కల్పించాం. సీఎం జగన్‌ ఉద్యోగుల్ని మోసం చేశారు. గురువుల్ని రోడ్లమీదకు తెచ్చారు. మీరు నియంతలు అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.ధైర్యముంటే ఉద్యోగులకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.

ఇకపై రాష్ట్రం ఉండదనుకుంటున్నారో.. తానే చివరి ముఖ్యమంత్రిని అనుకుంటున్నారో.. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. కలెక్టరేట్లు, గురుకుల పాఠశాలలు, విజయవాడలో పార్కు తాకట్టు పెట్టారు. రెండు రోజులు ఆగితే రహదారులనూ తాకట్టు పెట్టేస్తారేమో! -చంద్రబాబు

ఇదీ చదవండి

అశోక్‌బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

Last Updated :Feb 12, 2022, 4:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.