ETV Bharat / city

"ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు"

author img

By

Published : May 7, 2022, 9:11 PM IST

ప్రతిపక్ష నేతలు
ప్రతిపక్ష నేతలు

ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వంపై ప్రతిపక్ష, రైతు సంఘం నేతలు మండిపడ్డారు. మీటర్లు ఏర్పాటు అనేది రైతు వ్యతిరేక నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉచిత విద్యుత్​కు మంగళం పాడేందుకే.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు.. వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఇదంతా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం కాదా? అని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా..ఈ నెల 9న సచివాలయ ముట్టడిని చేపట్టనున్నట్లు వెల్లడించారు.

రైతు వ్యతిరేక నిర్ణయం: వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని.. వైకాపా ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని ఏపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఇది రైతు వ్యతిరేక నిర్ణయమంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మేం వ్యతిరేకం: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్ ఎలా వస్తుందని ఏపీ రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 7 గంటలు ఇచ్చి నిరంతర సరఫరా అనడం హాస్యాస్పదమన్నారు. మెట్ట పంటలకు వ్యవసాయ మోటార్లే ఆధారమని అన్నారు. రైతు సంఘాలన్నీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకమని చెప్పారు. రైతుకు ఉరితాడుగా మారే మీటర్ల యోచన వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.