దళితుల ఇల్లు కూల్చివేత.. అవమానంతో దంపతుల ఆత్మహత్యాయత్నం

author img

By

Published : May 7, 2022, 7:09 PM IST

Updated : May 8, 2022, 2:32 PM IST

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లిలో.. పోలీసులు, స్థానిక వైకాపా నేత తీరుతో మనస్తాపం చెందిన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెదేపా సానుభూతిపరులంటూ ఇంటిని కూల్చివేయడంతో దళిత దంపతులు పురుగుమందు తాగి బలవన్మరణానికి యత్నించారు.

తెదేపా సానుభూతిపరులంటూ ఇంటిని కూల్చివేయడంతో దళిత దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో చోటుచేసుకుంది. నిజవళ్లి గ్రామానికి చెందిన దళితులైన హనుమంత రాయుడు, అనితా లక్ష్మి దంపతులు ఊరి శివారులో పోలేపల్లికి వెళ్లే రహదారి పక్కన ఉన్న స్థలంలో మేకలదొడ్డి ఏర్పాటు చేసుకుని అందులోనే ఇల్లు కట్టుకుని 15 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వారు తెదేపా సానుభూతిపరులని, వారు ఉంటున్న స్థలం ప్రభుత్వానిదని, అక్కడి నుంచి ఖాళీ చేయించాలని... గత ఎన్నికల్లో వైకాపా మద్దతుతో సర్పంచిగా గెలిచిన ప్రభాకర్‌ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై ఆ దంపతులను పలుమార్లు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే అండతో తహసీల్దారుపై 8 నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. రెండునెలల కిందట తహసీల్దార్‌ గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడి మరో స్థలం కేటాయిస్తామని, ఖాళీ చేయాలని చెప్పారు. కేటాయించిన స్థలం పట్టా చూపి కాగితాలు అందిస్తే ఖాళీ చేస్తామని బాధితులు స్పష్టం చేశారు. అధికారులు ఎక్కడా స్థలం కేటాయించలేదు.

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

దంపతులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి...: శనివారం ఉదయం హనుమంత రాయుడు, అనితా లక్ష్మి పొలం పనిలో నిమగ్నమై ఉండగా పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కళ్యాణదుర్గం గ్రామీణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కంబదూరు, శెట్టూరు, కుందుర్పి ఎస్సైలు... సిబ్బంది, కళ్యాణదుర్గం నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందాన్ని పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ జమానుల్లాఖాన్‌... రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్లి బాధితుల ఇంటిని పొక్లెయిన్‌తో కూల్చి, సామగ్రిని బయట పడేశారు. గ్రామస్థుల్ని ఆ పరిసరాల్లోకి రాకుండా పోలీసులు నిలువరించారు. ఆ సమయంలో సర్పంచి ప్రభాకర్‌, ఎంపీపీ భర్త నాగరాజు, డీలర్‌ గోపాల్‌ అక్కడే ఉన్నారు.

ఈ విషయాన్ని గ్రామస్థులు.. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వర నాయుడి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సీఐ శ్రీనివాసులుకు ఫోన్‌ చేసి బాధితులకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, లేదంటే పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. దీంతో పోలీసులు బాధితులను సంఘటనా స్థలానికి తీసుకొచ్చారు. బాధిత దంపతులు పక్కనే ఉన్న రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ జమానుల్లాఖాన్‌ కాళ్లు పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. తమతోపాటు మరికొందరు స్థలాన్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని, వారిని ఏమీ అనకుండా తెదేపా సానుభూతిపరులమంటూ తమ ఇంటిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఎక్కడికెళ్లాలని కన్నీరుమున్నీరయ్యారు. ఉమామహేశ్వర నాయుడు అక్కడికి చేరుకుని సీఐ, ఇన్‌ఛార్జి తహసీల్దార్‌తో మాట్లాడుతుండగా... సర్పంచి ప్రభాకర్‌, వైకాపా మండల కన్వీనర్‌ సత్యనారాయణశాస్త్రి, జడ్పీటీసీ సభ్యుడు రాధాస్వామి, ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘటనా స్థలంలోకి పోలీసులు ఎవరినీ అనుమతించకున్నా. ఎస్సై కృష్ణమూర్తి వైకాపా నాయకులతో కలిసి అక్కడి చేరుకోవడం గమనార్హం.

పురుగుమందు తాగి...: స్థలం తమకు దక్కదనే ఆవేదన, అవమాన భారంతో బాధిత దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు... వైకాపా నాయకులను అక్కడి నుంచి పంపేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన దంపతులను అంబులెన్సులో కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అది ప్రభుత్వ స్థలమని, ఇప్పటికే నోటీసులిచ్చినా బాధితులు స్పందించలేదని, అందుకే ఇంటిని తొలగించినట్లు ఆర్డీవో నిషాంత్‌రెడ్డి చెప్పారు.

ఇవీ చూడండి

మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. 79 రోజులు నరకం

జగన్ వారివల్ల ముఖ్యమంత్రి కాలేరు: ఎమ్మెల్యే వాసుపల్లి

వామ్మో... ఈ సినీ స్టార్స్ చెల్లించే అద్దె తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Last Updated :May 8, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.