ETV Bharat / city

Jagan Davos Tour: కొవిడ్ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది: సీఎం జగన్‌

author img

By

Published : May 23, 2022, 8:02 PM IST

Updated : May 24, 2022, 3:30 AM IST

కొవిడ్ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది
కొవిడ్ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది

CM Jagan Davos Tour: కొవిడ్ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్‌ సమర్థవంతంగా ఎదుర్కొందని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వైద్య, ఆరోగ్య వ్యవస్థలపై నిర్వహించిన ఇష్టాగోష్టిలో సీఎం ప్రసంగించారు. ఆరోగ్య బీమాకు సంబంధించి భారత ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కన్నా.. ఆరోగ్యశ్రీలో ఎక్కువ చికిత్స విధానాలు ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించారు.

CM Jagan Davos Tour: జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలో కొవిడ్ మరణాల రేటు అతి తక్కువని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో.. పటిష్టమైన భవిష్యత్- ఆరోగ్య వ్యవస్థలు అనే అంశంపై సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి అత్యున్నత, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేవన్న ఆయన.. అయినప్పటికీ వాలంటీర్లు , గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ఏపీ ముందు నిలిచిందన్నారు. 44 సార్లు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వైద్యారోగ్య సర్వే చేపట్టామన్నారు.

కొవిడ్ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది

వైద్యారోగ్య సేవలకు బీమా తప్పనిసరిగా ఉండాలని.. ప్రజలు భారీగా పెరిగిన చికిత్సల ఖర్చు భరించేందుకు ఇది అవసరమని భావిస్తున్నట్టు సీఎం వివరించారు. ప్రస్తుతం భారత్​లో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టారని.. అయితే ఇది 1000 వైద్య చికిత్సలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. పేదలు వైద్యం చేయించుకునేందుకు ఇది ఏమాత్రం సరిపోదని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీలోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే బీమా వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తున్నట్టు సీఎం వివరించారు.

"ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా 1000 వైద్య చికిత్సలు అందిస్తుండగా.. ఏపీలో 2,446 వైద్య సేవలు ఆరోగ్యశ్రీలో భాగంగా ఉచితంగా అందిస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకు ఉచిత వైద్య కార్డులు ఇచ్చాం. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చేస్తున్నాం. గత మూడేళ్లుగా 25 లక్షల మందికి వైద్య సేవలు ఉచితంగా అందించాం."- జగన్, ముఖ్యమంత్రి

వైద్యారోగ్య సేవలు అందించేందుకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్న ముఖ్యమంత్రి.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వైద్యారోగ్య సేవలు మెరుగుపరిచేందుకు 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సు అనంతరం హీరో గ్రూప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ ఏపీ పెవిలియన్ వేదిక వద్ద సీఎం జగన్​తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో హీరో గ్రూప్ విస్తరణకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. అంతకు ముందు జపాన్ కంపెనీల ప్రతినిధులు మిట్సుయి ఓఎస్‌కే లైన్స్ సీఈవో తకిషీ హషిమోటో సీఎం జగన్​ను కలిశారు. షిప్పింగ్, లాజిస్టిక్స్‌పై ఏపీలో ఉన్న అవకాశాలపై సీఎంతో వారు చర్చించినట్లు సమాచారం.

..

ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు

* విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో టెక్‌ మహీంద్రా సహకరిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ఆయన దావోస్‌లో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంతోపాటు, 30 నైపుణ్య కళాశాలలు, 175 నైపుణ్య హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఆయనకు వివరించారు. సీఎంతో సమావేశం తర్వాత గుర్నానీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి మహీంద్ర అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది. దీనికి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు’ అని చెప్పారు.
* విద్యారంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంపై సీఎంతో చర్చించారు. స్మార్ట్‌ పోర్టులు, కొత్త తరహా ఇంధనాలపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
* భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌ బృందంతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై బృందంతో చర్చించారు.
* భారత్‌లో ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి కంపెనీ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తామని టోక్యో ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, సీఈవో తకిషి హషిమొటో పేర్కొన్నారు. సీఎం జగన్‌తో సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ‘షిప్పింగ్‌, సరకు రవాణా రంగంలో రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై చర్చించాం. మేమూ మా వ్యాపారాన్ని విస్తరిస్తాం’ అని పేర్కొన్నారు. కంటైనర్‌, లాజిస్టిక్‌ రంగాలపై సంస్థ పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆయన్ను కోరారు. కాకినాడలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
* రాష్ట్రంలో ప్లాంటు విస్తరణ గురించి హీరో గ్రూపు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజల్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చించారు.

..

రాష్ట్రంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు

రాష్ట్రంలో రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్‌లో ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్‌, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తరఫున ఆశిష్‌ రాజ్‌వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా కాలుష్యం లేని ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ సంస్థ అంగీకరించింది. 3,700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టు, 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.60వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి

Last Updated :May 24, 2022, 3:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.