ETV Bharat / city

తితిదే బోర్డు సభ్యులు 18 మందికి నోటీసులు

author img

By

Published : Oct 27, 2021, 11:27 AM IST

Updated : Oct 28, 2021, 4:58 AM IST

ap high court
ap high court

11:24 October 27

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈవోకూ జారీ

 

      నేరచరిత్ర, రాజకీయపార్టీలతో సంబంధం ఉన్న వారిని తితిదే పాలకమండలి సభ్యులుగా నియమించారంటూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, తితిదే మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. 18 మంది తితిదే బోర్డు సభ్యులతో పాటు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే కార్యనిర్వహణ అధికారి(ఈవో)కి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. హైకోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో పాకల అశోక్‌, మల్లాది కృష్ణారావు, ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, అల్లూరి మల్లేశ్వరి, ఎమ్మెల్యే ఆర్‌.విశ్వనాథరెడ్డి, బి.మధుసూదనయాదవ్‌, ఎమ్మెల్యే కె.సంజీవయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బండి పార్థసారథిరెడ్డి, ఎన్‌.శ్రీనివాసన్‌, రాజేశ్‌ శర్మ, ఎమ్మెల్యే ఏపీ నందకుమార్‌, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, పి.సనత్‌కుమార్‌, జూపల్లి రామేశ్వరరావు, ఎం.కేశవ్‌ నర్వేకర్‌, ఎంఎన్‌.శశిధర్‌ ఉన్నారు. తితిదే పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 245(28 బోర్డు సభ్యులు), జీవో 568(ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు) జీవో 569(50 ప్రత్యేక ఆహ్వానితుల) మొత్తం 80 మంది నియామకాన్ని సవాలు చేస్తూ భాజపా నేత జి.భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

       బుధవారం ఈ వ్యాజ్యంపై జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘దేవాదాయ చట్ట సెక్షన్‌ 18,19కి విరుద్ధంగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారిని, రాజకీయపార్టీలతో సన్నిహిత సంబంధం ఉన్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించారు. అలాంటి వారిని బోర్డు సభ్యులుగా నియమించడానికి వీల్లేదు. మొత్తం 18 మంది బోర్డు సభ్యులను ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశాం...’ అని పేర్కొన్నారు. భారత వైద్య మండలి మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కేతన్‌దేశాయ్‌కి సంబంధించిన చరిత్ర వివరాల్ని పరిశీలించాలని కోరారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడానికి ఆ వివరాలు చాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

జీవోలను వెబ్‌సైట్లో పెట్టకపోవడంపై కౌంటర్‌ దాఖలు చేయండి

ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాల విషయంలో వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానంగా(రిప్లై) మరో వారంలో కౌంటర్‌ వేయాలని పిటిషనర్లకు సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.   ‘జీవోఐఆర్‌’ సైట్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచకపోవడం మరోవైపు అత్యల్ప సంఖ్యలో జీవోలను ఏపీఈ గెజిట్‌ వెబ్‌సైట్లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 7న జారీచేసిన జీవో 100ను సవాలు చేస్తూ.. జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ‘తెలుగువన్‌.కామ్‌’ డిజిటల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కంఠంనేని రవిశంకర్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

ఇదీ చదవండి: 

DVC trust: డీవీసీ ట్రస్టుపై ప్రభుత్వం కన్ను.. ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు

Last Updated :Oct 28, 2021, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.