ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం

author img

By

Published : Dec 25, 2020, 11:28 AM IST

Updated : Dec 25, 2020, 12:40 PM IST

రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన తిరుమల, ద్వారకా తిరుమల, శ్రీశైలం, సింహాచలం లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండువగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తలతో సందడిగా మారాయి.
vaikunta ekadasi in Andhra Pradesh temples
vaikunta ekadasi in Andhra Pradesh temples

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇష్టదైవాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. అభిషేకం, అర్చన, అలంకరణ అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సహా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా తిరుమలలోని మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు.

విశాఖ జిల్లాలోని ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దేవ స్వరూపం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమిచ్చారు. ఆలయ ఛైర్​పర్సన్​ సంచయిత గజపతి.. స్వామి వారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు సాక్షాత్కరించారు. ఉత్సవమూర్తులుగా దేవి సమేత వరాహ లక్ష్మీ నరసింహుడుగా ముందుగా దర్శనమిచ్చి.. అనంతరం మూల విరాట్​ను దర్శనం చేసుకునెలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నియమాలు అనుసరిస్తూ ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.

కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఆలయ ఉత్తర ద్వారం ముఖం గుండా వచ్చిన అర్చకులు, వేదపండితులు మంత్రోచ్ఛారణలతో విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై అధిష్టింపజేసి మంగళవాయిద్యాల నడుమ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దేవతా మూర్తులకు మంగళ హారతులను ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నంద్యాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంజీవనగర్ కోదండ రామాలయ ఆవరణలో వెలిసిన శ్రీవెంకటేశ్వర స్వామిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. స్వామివారిని 10 లక్షల విలువైన కొత్త నోట్లతో అలంకరించారు. పాణ్యంలోని పురాతన దేవాలయమైన వీర నారాయణ స్వామి ఆలయంలో తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామస్మరణల నడుమ ఆలయ అర్చకులు వేదమంత్రాలు చదువుతూ ఉత్తర ద్వారాలు తెరిచి దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ అర్చకులు పండితులు ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై విశేషంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారాలు తెరిచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు.

కృష్ణా జిల్లా విజయవాడలో వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో 11అడుగుల ఏకశిలా విగ్రహం శ్రీ శ్రీమన్నారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి స్వామి వారి పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక కైంకర్యాలు, పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చల్లపల్లి మండలంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు.

నూజివీడులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. మాస్కులు ధరించిన భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశాలను కల్పించారు. స్వామివారి దర్శనానంతరం తీర్ధ ప్రసాదాలను అందజేశారు.గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం ఇచ్చిన ఆదిత్యుని దివ్య రూపం వీక్షించి.. భక్తులు పులకించిపోయారు.

అనంతపురం జిల్లా గుంతకల్లులోని రాజేంద్రనగర్​లో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో మండపంలో సూర్య ప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామిని అలంకరించి వేంకటేశ్వరుడి తులా భారం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కదిరిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడిని ఉత్తర గోపురం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై అధిష్టింప చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు రాజ గోపురం నుంచి దర్శించుకుని, ఉత్తర గోపురం కింద కొలువైన ఉత్సవమూర్తులను దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర గోపురం దర్శనాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి అన్ని ఏర్పాట్లను చేసింది.

ప్రకాశం జిల్లా ఒంగోలులో పలు ఆలయాల్లో తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి చూశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

విజయగరం జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా భక్తులు ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయాల్లో ఆరాధన సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఆలయ అధికారులుఏర్పాటు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో కొలువైన ప్రముఖ దేవాలయం అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. లంకల గన్నవరం పోతవరం అంబాజీపేట నల్లచెరువు గ్రామాలలో కొలువైన కలియుగ వెంకటేశ్వర స్వామిని భక్తులు వైకుంఠ ద్వారంలో వెళ్లి దర్శనం చేసుకున్నారు.

కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయమంతా పుష్పాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామి వారిని అనేక రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, బుడుగుంట పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, పెనగలూరు మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. దేవతా మూర్తులకు కల్యాణం జరిపారు. సుదర్శన హోమం నిర్వహించారు. పట్టణంలోని కృష్ణ మందిరంలో ఉత్తర దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు.

ఇదీ చదవండి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు

Last Updated :Dec 25, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.