ETV Bharat / city

Realtors Murder Update: రియల్టర్లపై కాల్పుల ఘటనలో ముమ్మర దర్యాప్తు.. పలు కోణాల్లో విచారణ

author img

By

Published : Mar 3, 2022, 11:59 AM IST

Telangana Realtors Murder Case: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కర్ణంగూడ కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. శ్రీనివాస్ రెడ్డి వివాదాస్పద భూములు సెటిల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. గత కొన్ని నెలలుగా ఆయన జోక్యం చేసుకున్న భూవ్యవహారాల గురించి ఆరా తీస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Realtors Murder update
Realtors Murder update

Telangana Realtors Murder Case: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలోనే స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్​ రెడ్డి చనిపోగా.. చికిత్స పొందుతూ రాఘవేందర్​ రెడ్డి మృతిచెందారు. తమపై కాల్పులు జరిపింది ఎవరో తెలియదని చెప్పిన రాఘవేందర్ రెడ్డి.. అంతలోనే పరిస్థితి విషమించటంతో ప్రాణాలు విడిచారు. కాల్పుల గురించి తెలుసుకునే లోపే ఆయన చనిపోవటంతో కేసు విచారణ పోలీసులకు సవాల్​గా మారింది. దీంతో సాంకేతిక ఆధారాలపైనే దృష్టి సారించిన పోలీసులు... మృతుల కాల్​డేటా, సెల్​ఫోన్​ సిగ్నళ్ల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు.

వివాదాస్పద భూముల సెటిల్మెంట్​లోను చేయి

శ్రీనివాస్​ రెడ్డి వివాదాస్పద భూములు సెటిల్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలలుగా సెటిల్​మెంట్​ చేసిన భూములు, ఫ్లాట్ల వివరాలను సేకరించారు. కాల్పులకు కర్ణంగూడ వివాదాస్పద భూమి కారణమని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా విచారణ చేపట్టారు. మరోవైపు కాల్పులకు పాత కక్షలు కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఇటీవల శ్రీనివాస్​ రెడ్డి చేసిన సెటిల్​మెంట్​ వివరాలను సేకరిస్తున్నారు. కిరాయి హంతకులు కాల్పులు జరిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. సాంకేతిక, ఇతర ఆధారాలు క్రోడీకరించి విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్​ రెడ్డి డ్రైవర్​ కృష్ణ, హఫీజ్​ల పేరు మీద పలు ఆస్తులను.. ఆయన రిజిస్ట్రేషన్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ శ్రీనివాస్ రెడ్డికి బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. కృష్ణ, హఫీజ్​లతో పాటు పక్క పొలానికి చెందిన మట్టారెడ్డి, ఇతర అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రెక్కీ నిర్వహించి

కాల్పులకు పాల్పడింది ప్రొఫెషనల్‌ షూటర్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుపారీ గ్యాంగ్​తో హత్య చేయించి ఉండొచ్చనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అప్పటికే శ్రీనివాస్​ రెడ్డి, రాఘవేందర్రెడ్డిని మట్టుబెట్టేందుకు రెక్కీ నిర్వహించి కర్ణంగూడ ప్రాంతాన్ని అనువైన స్థలంగా దుండగులు ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఎస్‌వోటీ, ఐటీ సెల్‌, సీసీఎస్‌, ఎస్బీ, ఇంటెలిజెన్స్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

Realtors Murder in Rangareddy District: హైదరాబాద్‌ శివారు ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడ సమీపంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిపై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మరణించారు. రాఘవేంద్రరెడ్డి వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు వెంటాడి ఛాతీపై కాల్చారు. కుప్పకూలిన ఆయన్ను స్థానికులు వనస్థలిపురం బీఎన్​ రెడ్డి నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని వేర్వేరు తుపాకులతో కాల్చినట్టు నిర్ధరణకు వచ్చారు. గురి తప్పకుండా తుపాకీ పేల్చడాన్ని వృత్తిగా ఎంచుకున్నవారే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆగంతకులు ఏ వాహనంలో వచ్చారు? ఎలా వెళ్లిపోయారనే విషయాలను ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.