ETV Bharat / city

HEAVY RAINS IN AP: నిలువెల్లా జల ఖడ్గపు గాయాలే.. మళ్లీ ఉరుముతున్న వరుణుడు!

author img

By

Published : Nov 28, 2021, 3:22 PM IST

Updated : Nov 28, 2021, 4:58 PM IST

floods effect on ap people
మొన్నటి వరదల నుంచే తేలుకోలే.. వామ్మో మళ్లీ వర్షాలా..?

HEAVY RAINS IN AP: ఆ విలయం ఊహకందనిది.. ఆ ఉత్పాతం భరించలేనిది.. ప్రకృతి దూసిన జల ఖడ్గానికి పల్లెలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి! గడిచిన పక్షం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు.. ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైపోగా.. ఊళ్లకు ఊళ్లే ధ్వంసమై, తీరని విషాదం సంభవించింది. ఈ విధ్వంసంలో పదుల సంఖ్యలో ప్రాణాలు.. వందల సంఖ్యలో మూగజీవాలు.. కోట్లల్లో ఆస్తులు కొట్టుకుపోయాయి. లెక్క తేల్చడానికి కేంద్రమే తరలివచ్చింది. ఇప్పటివరకు 44 మంది మృతి చెందగా.. 2.86 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇంతటి ఉపద్రవం నుంచి ఇంకా కోలుకోనే లేదు.. మరోమారు వరుణుడు ఉరుముతున్నాడు! మళ్లీ వర్షపు కత్తులు విసురుతున్నాడు.. వాతావరణ శాఖ చేస్తున్న తాజా హెచ్చరికలు.. వరద బాధితులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

FLOODS EFFECT IN AP : వరదల పేరు వింటేనే రాష్ట్ర ప్రజలంతా వణికిపోతున్నారు. గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడి చికిత్స అందక నరకయాతన అనుభవిస్తున్నారు. తినేందుకు తిండి, తాగేందుకు నీరు, కట్టుకునేందుకు బట్ట లేక కన్నీరుమున్నీరవుతున్నారు. భారీ వరదల నుంచి పలువురు ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ.. తమ జీవనాధారాన్నే కోల్పోయారు. వాటి నుంచి కాస్త కూడా తేరుకోకముందే.. మళ్లీ రాష్ట్రంలో భారీ వర్ష సూచన అన్న వార్తతో జనాలు గడగడా వణికిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక.. ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

44 మంది మృతి
44 PEOPLE LOST LIVES IN HEAVY RAINS IN RAIN: రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. చూస్తుండగానే.. నదులు, జలాశయాలు, చెరువుల కట్టలు తెగిపోయాయి. అధికారుల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసేలోపు వరదలు గ్రామాల్లోకి చేరి ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలామంది మృతదేహాలు ఇప్పటికీ లభ్యంకాలేదు. తమ కళ్ల ముందే కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లు కొట్టుకుపోవడం చూసి ప్రజలు.. కన్నీరుమున్నీరవుతున్నారు. కడప జిల్లాలో ఓ వ్యక్తి తమ కుటుంబంలోని ఏడుగురిని కాపాడి వరదలో కొట్టుకుపోయాడు. ఇలా గల్లంతైన ఎంతో మంది ఆచూకీ లభ్యం కాలేదు. తమ వాళ్లు ప్రాణాలతో బయటపడితే బాగుండని కోరుకుంటూనే.. ఒకవేళ చనిపోతే శవాలైన దొరకాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు బాధితులు.

మొన్నటి వరదల నుంచే తేలుకోలే.. వామ్మో మళ్లీ వర్షాలా..?
మొన్నటి వరదల నుంచే తేలుకోలే.. వామ్మో మళ్లీ వర్షాలా..?

ఇళ్లూ, జీవనాధారం కోల్పోయిన వేల కుటుంబాలు
కనీవినీ ఎరగని స్థాయిలో విరుచుకుపడిన వరదల (HEAVY RAINS IN AP) ధాటికి.. చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 13 వందలకు పైగా గ్రామాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కళ్లముందే ఎత్తైన భవంతులు నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు మిగిలినప్పటికీ.. ఇళ్లలో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. బంగారం, డబ్బులే కాదు గ్యాస్‌ సిలిండర్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు సహా అన్నీ కొట్టుకుపోయాయి. ఆవులు, గేదెలు, మేకలు వందల సంఖ్యలో నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికీ చాలా గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వర్షాల కారణంగా పునరావాస కేంద్రాలకు వెళ్లిన చాలా మంది ఇంకా తమ ఇళ్లకు తిరిగిరాలేదు. వచ్చినా.. వారి ఇళ్లు ఎక్కడున్నాయో కూడా గుర్తుపట్టలేని విధంగా పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

మొన్నటి వరదల నుంచే తేలుకోలే.. వామ్మో మళ్లీ వర్షాలా..?
మొన్నటి వరదల నుంచే తేలుకోలే.. వామ్మో మళ్లీ వర్షాలా..?

కోతకు గురైన రోడ్లు.. ఎక్కడికీ వెళ్లలేక జనాలు ఇక్కట్లు..(ROADS FULLY DAMAGED IN AP)
వరద ధాటికి వంతెనలు కుప్పకూలాయి.. రోడ్లు కొట్టుకుపోయాయి.. రైలు పట్టాలు నీటిపై తేలియాడాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో నెల్లూరు దాటాక దామరమడుగు వద్ద 16వ నంబరు జాతీయ రహదారి ఓ వైపు కొట్టుకుపోయింది. నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో ట్రాక్‌ మీదకు నీరు రావడంతో పలు రైళ్లను నిలిపేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో రాయల చెరువుకు లీకేజీ ఏర్పడి వంద గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. తిరుపతి నగరం వరద నుంచి ఇంకా కోలుకోలేదు. కడప జిల్లాలోని పాపాగ్ని నదిపై వంతెన కుప్పకూలింది.

ఇసుక దిబ్బల్లా మారిన పంట భూములు..!
నదుల పక్కనున్న జలాశయాల కట్టలు తెగిపోయి.. వరద నీరంతా నదీ పరివాహక ప్రాంతాలను ముంచేసింది. కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి.. పచ్చని పంటపొలాల్ని, తోటల్ని మొత్తం ఇసుక దిబ్బలుగా మార్చేసింది. వరద ప్రభావిత గ్రామాల్లోని పంట పొలాల్లో నాలుగు అడుగుల ఎత్తున ఇసుక పేరుకుపోయింది. చాలా గ్రామాల్లో వందల ఎకరాల్లోకి ఇసుక దిబ్బలు వచ్చేశాయి. ఏటా రెండు, మూడు పంటలు సాగు చేసే రైతులు... కనీసం తమ పంట పొలాలను తిరిగి సాగులోకి తేగలమా? అందుకు ఎన్నేళ్లు పడుతుంది? అప్పటివరకూ బతికెదేలా? అంటూ ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ భూమి కోతకు గురై సాగుకు పనికిరాకుండా పోయింది.

మొన్నటి వరదల నుంచే తేలుకోలే.. వామ్మో మళ్లీ వర్షాలా..?

వేల ఎకరాల్లో పంట నష్టం..
PADDY LOSS ON FLOOD AFFECTED AREAS IN AP: భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రధాన పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. కృష్ణా, గోదావరి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడం వల్ల లక్షల ఎకరాల పంట.. నీటమునిగింది. పత్తి, మిరప, వరి, వేరు శనగ, అరటి, తమలాపాకు సహా ఇతర పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం.. వర్షార్పణమైంది. కొన్నిచోట్ల ధాన్యం పూర్తిగా నానిపోయి మొలకలు వచ్చాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో 2.86 లక్షల హెక్టార్లలోని పంట నష్టపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది. ఈ నష్టం ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

కనీస వసతులు లేక.. రోడ్లపైనే జీవనం
NO FACILITIES TO FLOODS VICTIMS IN AP : వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ... ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. ఎక్కడుండాలో తెలీక చాలా మంది భయంకర పరిస్థితుల్లో గడుపుతున్నారు. చిన్న పిల్లలు, ముసలి వారు చలికి తట్టుకోలేక... తినేందుకు సరైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈగలు, దోమలు ముసురుతూ... అనేక రోగాల బారిన పడుతున్నారు. కడప జిల్లాలో జబ్బు బారిన పడిన వారు చికిత్స చేయించుకునేందుకు అవకాశం లేక చనిపోతున్నారు. అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి చెయ్యేరుకు వరద పోటెత్తింది. ఆ ప్రాంతంలో 3 కిలోమీటర్ల రహదారి ఉనికే లేకుండా పోయింది. పెనగలూరు మండలంలో గ్రామీణుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నెల్లూరు జిల్లాలోని పరిస్థితి కూడా అత్యంత ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మధురపేటలో 15 ఎకరాల పంట నీటి పాలవడంతో కౌలు రైతు మధుర సాయిబాబు (54) గుండెపోటుతో చనిపోయారు.

సీఎం ఏరియల్ సర్వే..
CM YS JAGAN AERIAL SURVEY : రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల్లో సీఎం సర్వే నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వీహంగ వీక్షణం ద్వారా మంత్రులతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలను ఉచితంగా సరఫరా చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

కేంద్రం బృందం పర్యటన..
CENTRAL TEAM VISITS FLOOD AFFECTED AREAS IN AP: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు ఇప్పటికీ పర్యటిస్తున్నాయి. వర్షాలకు దెబ్బతిన్న అరటి, కొబ్బరి తోటలతో పాటు వరి, వేరుశనగ పంటలను, ఇళ్లను బృందం పరిశీలించింది. ఆయా ప్రాంత ప్రజలతో ముచ్చటిస్తూ.. వారికి జరిగిన నష్టాలను బేరీజు వేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో సంభవించిన నష్టాన్నిఅంచనా వేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి.

రాజకీయ పార్టీల చేయూత..!
POLITICAL LEADERS HELP TO FLOODS VICTIMS IN AP: వరద బాధిత ప్రాంతాల ప్రజలకు సాయం చేసేందుకు భాజపా, జనసేన, తెదేపా శ్రేణులు ముందుకొచ్చాయి. భాజపా నేతలు విరాళాలు సేకరిస్తూ... వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఉచిత అన్నదానాలు, నిత్యావసర సరుకుల పంపిణీ, వైద్య సేవలందిస్తూ.. సాయంగా నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు.. బాధితుల హోదాతో సంబంధం లేకుండా రూ.5,000 ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు.

మళ్లీ వర్ష భయం..
వరుణుడు సృష్టంచిన విలయానికి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఇంతలోనే మళ్లీ రాష్ట్రానికి వర్ష భయం పట్టుకుంది. అల్పపీడవ ప్రభావంతో 30వ తేదీ నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త విన్న అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగనుందనే ఆందోళన నెలకొంది.

ఇదీ చూడండి: HEAVY RAINS IN NELLORE AND KADAPA : నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షం...ఆందోళనలో ప్రజలు

Last Updated :Nov 28, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.