ETV Bharat / city

పోలింగ్ ప్రశాంతం: స్ట్రాంగ్‌ రూంల్లో భద్రంగా బ్యాలెట్‌ బాక్సులు

author img

By

Published : Mar 11, 2021, 3:16 AM IST

Updated : Mar 11, 2021, 7:13 AM IST

పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం

పురపాలక ఎన్నికల్లో ఓ అంకం పూర్తైంది. పోలింగ్‌ పక్రియ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికల సిబ్బంది స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. ఈనెల 14న కౌంటింగ్‌ జరుగనుంది. అప్పటి వరకు స్ట్రాంగ్‌ రూంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య పర్యవేక్షిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

స్ట్రాంగ్‌ రూంల్లో భద్రంగా బ్యాలెట్‌ బాక్సులు

రాష్ట్రంలో పుర ఎన్నికల్లో కీలక అంకం ముగిసింది. పోలింగ్‌ జరిగిన కేంద్రాల నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు బ్యాలెట్‌ బాక్సును స్ట్రాంగ్‌ రూంలకు చేర్చారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ ముగిసిన వెంటనే వివరాలు రికార్డుల్లో నమోదు చేసి.. ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు. అక్కడి నుంచి స్ట్రాంగ్ రూంకు తరలించారు. గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను లయోలా కళాశాలలో ఉంచారు. అక్కడే 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

కట్టుదిట్టమైన భద్రత..

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ బ్యాలెట్ బాక్సులను స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో అధికారులు భద్రపరిచారు. ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీలో 19 వార్డుల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సులను అధికారులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు చేర్చారు. బ్యాలెట్‌ బాక్సుల గదుల దగ్గర కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. అనంతపురం జిల్లా హిందూపురం పురపాలికలో 38 వార్డు ఉండగా 65.61 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను ఎంజీఎం పాఠశాలలో భద్రపరిచారు.

తూర్పు గోదావరి జిల్లాలో 81.89 ఓటింగ్..

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 81.89 ఓటింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల సమక్షంలోనే పోలీసులు భద్రపరిచారు. విశాఖలో సౌత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 1712 పోలింగ్ కేంద్రాల్లో 2957 బ్యాలెట్ బాక్సులను వినియోగించారు. వీటిని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. విజయనగరం జిల్లా సాలూరులో బ్యాలెట్‌ బాక్సులను తిరిగి అధికారులు మున్సిపల్ కార్యాలయానికి చేర్చారు. సీల్ వేసి కట్టుదిట్టమైన భద్రత పెట్టారు.

స్ట్రాంగ్ రూంల భద్రతపై అనుమానం..

మరోవైపు స్ట్రాంగ్ రూంల భద్రతపై తెలుగుదేశం అనుమానం వ్యక్తం చేసింది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలోతాళం వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నందున అక్కడ అధికారులు ఏమైనా చేస్తారనే అనుమానం ఉందన్నారు. దీనిపై స్పందించిన ఎస్​ఈసీ.. స్ట్రాంగ్ రూంల వద్ద బ్యాలెట్ బాక్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బ్యాలెట్‌ బాక్సుల నిరంతర పర్యవేక్షణకు వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు నిమ్మగడ్డ వెల్లడించారు. స్ట్రాంగ్ రూం తాళాలపై తమ సొంత సీల్ వేసుకునేందుకు రాజకీయపార్టీలకు అనుమతించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

మున్సిపల్​ ఎన్నికల్లో 62.28 శాతం పోలింగ్ నమోదు

Last Updated :Mar 11, 2021, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.