సైబర్ సేఫ్టీ టిప్స్.. ఆన్​లైన్ ఐడెంటిటీ చోరీ కాకుండా కాపాడుకోండిలా..

author img

By

Published : May 27, 2023, 9:15 AM IST

what-do-if-cyber-criminals-steal-our-identity-cyber-crime-prevention-tips

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ అదే స్థాయిలో చోరీలు కూడా పెరుగుతున్నాయి. తెలివిమీరిన దొంగలు ఐడెంటిటీ థెఫ్ట్​కు పాల్పడుతున్నారు. తెలియకుండానే మన పేరుపై అప్పు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో సంతకాలు ఫోర్జరీ చేసేవారు... సాంకేతిక యుగంలో మాత్రం దొంగలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. మన గుర్తింపు ధ్రువీకరణలను చోరీ చేసి, అకౌంట్​ల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. మనకు తెలియకుండానే మన పేరుపై అప్పులు తీసుకుంటున్నారు. అందుకే పాన్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో, ఫోన్‌ల ద్వారా సంప్రదించే వారిని మనం అస్సలు నమ్మకూడదు.
ప్రస్తుత యుగంలో గుర్తింపు ధ్రువీకరణ అంటే ఏదో ఒక పత్రం కాదు. ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేసేందుకు దొంగలకు ఒక ఆయుధం వంటిది. ఎవరికి వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసంర ఉంది. అప్పుడే మోసానికి గురవ్వకుండా ఉండగలం.

నివేదికలను చూసుకోండి..
మన పేరుమీద ఎన్ని అకౌంట్​లు ఉన్నాయి? లోన్​లు, కార్డులు ఎన్ని ఉన్నాయనే సంగతులను సులభంగా తెలుసుకునేందుకు.. క్రెడిట్‌ నివేదికలు మనకు తోడ్పడతాయి. భారత్​లో ప్రధానంగా మూడు క్రెడిట్‌ బ్యూరోలు ఉన్నాయి. అవి సిబిల్‌, ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫాక్స్‌. సంవత్సరానికి ఒక సారైనా ప్రతి క్రెడిట్‌ బ్యూరో వద్ద మీ క్రెడిట్‌ నివేదికలను తీసుకోవడం మంచిది. వాటిని విశ్లేషించి, ఏమైనా అనధికార అకౌంట్​లు ఉన్నాయా అనేది చూసుకోండి. ఒకవేళ అలాంటివి గుర్తిస్తే వెంటనే క్రెడిట్‌ బ్యూరోలకు ఫిర్యాదు చేయండి. వారు దర్యాప్తు చేసి, మీ నివేదికల్లో ఉన్న ఆ వివాదాస్పద అంశాలను తొలగిస్తారు.

సందేశం వచ్చేలా..
మూడు క్రెడిట్‌ బ్యూరోల్లోనూ ఫ్రాడ్‌ అలర్ట్‌ పెట్టుకునే అవకాశం ఉంది. మీ గుర్తింపు వివరాలను వాడి, మీ పేరుమీద ఏదైనా లోన్​ దరఖాస్తు వచ్చినా, ఎవరైనా అకౌంట్​ ప్రారంభించేందుకు యత్నించినా మీకు వెంటనే సందేశం వస్తుంది. దీనివల్ల మీరు మోసపోకుండా రక్షణ లభిస్తుంది.
సాధారణంగా మీ గుర్తింపు వివరాలను తస్కరించిన సైబర్‌ నేరస్థులు వెంటనే ఆ సమాచారాన్ని ఉపయోగించరు. కొన్నిరోజులు, నెలల పాటు వేచి చూస్తారు. ఆ తర్వాతే వారి పని మొదలు పెడతారు. కాబట్టి, ఎప్పటికప్పుడు మీ క్రెడిట్‌ నివేదికలను పరిశీలించాల్సిన అవసరం ఎతైనా ఉంది.

భద్రంగా ఉంచుకోండి..
ఆన్‌లైన్‌లోనూ, సోషల్​ మీడియా వేదికల ద్వారా పాన్‌, ఆధార్‌ కార్డులను పంపించడం చాలా సర్వసాధారణం. దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. మరీ అత్యవసరం సమయాల్లో, తెలిసిన వ్యక్తులకు మాత్రమే ఈ వివరాలు పంపించాలి. బ్యాంకు ఆన్‌లైన్‌ అకౌంట్​లకు సంఖ్యలు, గుర్తులతో బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం వంటివి చేయండి. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ మీ లాగిన్‌ సమాచారం గానీ కార్డు సీవీవీ గానీ ఓటీపీలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగదు.

ఇ-మెయిల్స్‌లో వచ్చిన లింకులపై అస్సలు క్లిక్‌ చేయొద్దు. సమాచారం కోరుతూ బ్యాంకు నుంచి ఎలాంటి ఇ-మెయిళ్లూ కూడా రావు. సునిశితమైన సమాచారం మీ దగ్గర్నుంచి ఎప్పుడూ చేజారకుండా చూసుకోండి. మీ వ్యక్తిగత వివరాలున్న పత్రాలను పూర్తిగా చించేశాకే పారేయాలి. అప్పుడే మీ గుర్తింపు వివరాలు చోరికి గురి కాకుండా చూసుకోవచ్చు.

ఇలా చేయండి..
తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీ గుర్తింపు వివరాలు దొంగల చేతికి చేరితే..
పోలీసులకు ఫిర్యాదు:
మొదలు మీ సమీప పోలీస్‌ స్టేషనుకు వెళ్లండి. వారికి తగిన వివరాలను చెప్పి ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదు చేయించండి. అనంతరం పోలీసులు దర్యాప్తు మొదలుపెడతారు.

క్రెడిట్‌ ఫ్రీజ్‌:
ప్రధాన మూడు క్రెడిట్‌ బ్యూరోలను మీరు సంప్రదించడం ద్వారా క్రెడిట్‌ ఫ్రీజ్‌ చేయొచ్చు. దీనివల్ల మీ క్రెడిట్‌ నివేదికను మీ అనుమతి లేకుండా ఎవరూ చూసేందుకు వీలు పడదు. ఇదీ మీ పేరిట.. దొంగలు అకౌంట్​ తెరవకుండా ఉపకరిస్తుంది.

బ్యాంకులను సంప్రదించండి:
మీ ఐడెంటిటీ థెఫ్ట్ ​( గుర్తింపు దొంగతనం) జరిగిందన్న విషయాన్ని మీ అకౌంట్​ ఉన్న బ్యాంకులకు తెలపండి. అప్పుడు ఏవైనా మోసపూరిత అకౌంట్​లు ఉంటే రద్దు చేస్తారు. మీ అకౌంట్​లలో అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయోమో గమనించి చర్యలు తీసుకుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.