ETV Bharat / business

ఆ ఖాతాలకు ట్విట్టర్ బ్లూటిక్ ఉచితం.. ఎలన్​ మస్క్ బంపర్ ఆఫర్

author img

By

Published : Apr 2, 2023, 3:44 PM IST

బ్లూటిక్ వెరిఫికేషన్​కు సంబంధించి ట్విట్టర్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 10వేల కంపెనీలకు ఉచితంగా బ్లూటిక్ రైట్స్​​ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ట్విట్టర్​లో అత్యధికంగా యాడ్స్​ ఇస్తున్న 500 అడ్వర్టైజర్లకు కూడా ఫ్రీగా వెరిఫికేషన్ బ్యాడ్జి ఇస్తామని తెలిపింది.

twitter bluetick free for 10000 companies latest news
పదివేల 500 మందికి మాత్రమే ట్విటర్ బ్లూటిక్ ఉచితం

సోషల్​ మీడియా సంస్థ ట్విటర్.. బ్లూటిక్​కు సంబంధించి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్​ 10వేల కంపెనీలకు ఉచితంగానే బ్లూటిక్ రైట్స్​​ను ఇవ్వనున్నట్లు ప్రకిటించింది. అలాగే ట్విట్టర్​లో భారీగా ఫీజు చెల్లించి అత్యధికంగా యాడ్స్​ ఇస్తున్న 500 టాప్​ అడ్వర్టైజర్లకు కూడా ఈ నిర్ణయాన్ని వర్తింపచేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆయా కంపెనీ ఖాతాల్లోని ఫాలోవర్స్ ఆధారంగానే టాప్​ కంపెనీలతో పాటు ప్రముఖ యాడ్​ కంపెనీలను గుర్తించి వాటికి మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని సంస్థ వెల్లడించింది. ట్విట్టర్​ వరుస నిర్ణయాలతో పలు కంపెనీల అడ్వర్టైజర్ల లాభాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయా సంస్థలను సంతృప్తి పరిచేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్​లో వెరిఫైడ్(అధికారిక)​ అకౌంట్​గా పరిగణించే బ్లూటిక్​ను పొందాలంటే ప్రస్తుతం 1000 డాలర్ల(భారత కరెన్సీలో రూ.82,000) రుసుము చెల్లించాల్సి ఉంది. ఈ బ్లూటిక్​ ఉంటేనే ఆయా ఖాతాలను అధికారికమైన అకౌంట్లుగా భావిస్తారు. నెలవారీ లేదా వార్షిక రుసుమును చెల్లించి​న తర్వాతే ఈ బ్లూటిక్​ హక్కులను ఆయా సంస్థలకు ఇస్తుంది ట్విట్టర్​.

కాగా, బ్లూటిక్​ వెరిఫికేషన్​ పాత విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్​ నుంచే నిలిపివేయనున్నట్లు ఇదివరకే సంస్థ అధినేత ఎలాన్​ మస్క్​ ప్రకటించారు. దీని స్థానంలో నిర్ణీత ఫీజు చెల్లించిన వారికే మాత్రమే బ్లూటిక్​ రైట్స్​ను ఇస్తామని ట్విట్టర్​ ప్రకటించిన నేపథ్యంలో సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది. వెరిఫికేషన్ ఫర్ ఆర్గనైజేషన్స్​గా పిలుస్తున్న ఈ కొత్త ప్రోగ్రామ్​లో కంపెనీలు తమ వెరిఫైడ్​ అకౌంట్​ కోసం నెలకు వెయ్యి డాలర్లు చెల్లిస్తుండగా.. వాటి అనుబంధ కంపెనీల ఖాతాల కోసం అదనంగా 50 డాలర్లు(రూ.4,100)రుసుమును కట్టాలనే నిబంధన ఉంది.

వీరికి మాత్రమే ఓటు వేసే అవకాశం..
బ్లూటిక్ ఉన్న వారు మాత్రమే ట్విట్టర్​ నిర్వహించే పోల్స్​లో పాల్గొనడానికి అర్హులంటూ ఎలాన్​ మస్క్ ఇటీవలే ప్రకటించారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి అందుబాటులోకి వస్తుందని కూడా తెలిపారు. ఈ ప్రకటన వెలువడక ముందు ట్విట్టర్ పోల్స్​లో ఇష్టారాజ్యంగా అందరూ పాల్గొని ఓటు వేసే అవకాశం ఉండేది. కానీ, మస్క్​ తాజా ప్రకటనతో ఆ విధానానికి చెక్​ పడ్డట్లయింది. దీంతో కేవలం బ్లూటిక్ ఉన్న వెరిఫైడ్ అకౌంట్స్​​ వారు మాత్రమే పోల్స్​ ప్రక్రియలో ఓటు వేసే వీలును కల్పించింది ట్విట్టర్​.

బ్లూటిక్​తో లాభమేంటి..?
ట్విట్టర్​లో అధికారిక ఖాతాను నిర్ధారించుకోవడానికి బ్లూటిక్​​లపైనే ఆధారపడతారు యూజర్లు. ఈ కారణంతోనే కంపెనీ(ట్విట్టర్) పట్ల కూడా వినియోగదారులు విశ్వసనీయతను కోల్పోవద్దనే ఉద్దేశంతోనే నిబంధనల్లో పలు మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది ట్విట్టర్​. ఈ భారీ మార్పుల కారణంగా భారతదేశంలో ఇప్పటివరకు సుమారు 6.8 లక్షలకు పైగా ట్విటర్ ఖాతాలు నిషేధిత జాబితాలో చేరాయి.

బ్లూటిక్ మాత్రమే కాదు.. ఇంకా ఉన్నాయి!
ఏదైనా సంస్థ ఎటువంటి లాభాలు ఆర్జించకుండా పనిచేస్తే వాటికి ట్విట్టర్​లో 'గోల్డ్​ టిక్'​ మార్క్​తో పాటు స్క్వేర్​ అవతార్​ గుర్తును ఇస్తుంది ట్విట్టర్​. ప్రభుత్వ రంగ సంస్థలకు 'గ్రే టిక్' మార్క్​తో పాటు గుండ్రంగా ఉండే అవతార్​ గుర్తును మంజూరు చేస్తుంది సంస్థ. అయితే 'గోల్డ్ టిక్​' కోసం సంస్థలు ప్రతి నెలా 1,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.82,300)లు చెల్లించాలి. అదే ఒక వ్యక్తిగత ఖాతాలకు 8 డాలర్లు(రూ. 657.45)లు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.