ETV Bharat / business

60 వేలు దాటిన సెన్సెక్స్‌.. రెండు నెలల్లో ఎంత మార్పో

author img

By

Published : Aug 17, 2022, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 418 పాయింట్లు ఎగబాకింది. 60 వేల పాయింట్ల ఎగువన ట్రేడింగ్ ముగించింది.

stock market closing
స్టాక్ మార్కెట్

Stock Market closing: స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 418 పాయింట్లు వృద్ధి చెంది, 60వేల పాయింట్ల ఎగువన స్థిరపడింది. రెండు నెలల తర్వాత మళ్లీ సెన్సెక్స్ 60 వేల మార్కును అందుకోవడం విశేషం. మరోవైపు, నిఫ్టీ సైతం లాభాలు గడించింది. 119 పాయింట్లు ఎగబాకి 17,944 వద్ద ట్రేడింగ్ ముగించింది.

Stock Market today: జూన్‌ 17.. సరిగ్గా రెండు నెలల క్రితం. 40 ఏళ్ల గరిష్ఠానికి అమెరికా ద్రవ్యోల్బణం చేరడం.. వడ్డీ రేట్ల పెంపు భయాలు.. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు.. వెరసి మన మార్కెట్లు కుదేలయ్యాయి. కొవిడ్‌ తర్వాత భారీగా పుంజుకుని 60 వేల మార్కు దాటిన సెన్సెక్స్‌కు నష్టాలు పోటెత్తాయి. దీంతో జూన్‌ 17న 50,921 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌ 52 వారాల కనిష్ఠానికి చేరింది. సరిగ్గా రెండు నెలలు తిరిగే సరికి మళ్లీ సెన్సెక్స్‌ పుంజుకుంది. ఆగస్టు 17న మళ్లీ 60 వేల మార్కును అందుకుంది. ఈ రెండు నెలల్లో ఇంతకీ ఏం మారింది?

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత కొన్ని రోజులుగా వరుస లాభాలు ఆర్జిస్తున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లోనూ అదే పునరావృతమైంది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడంతో సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బుధవారం 60వేల మార్కును అందుకుంది. చివరకు సెన్సెక్స్ 418 పాయింట్లు పెరిగి 60,260 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్ల వృద్ధితో 17,944 వద్ద ముగిసింది.

తగ్గిన ద్రవ్యోల్బణ భయాలు
అటు అమెరికాతో పాటు, దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్లను వణికించాయి. దీంతో సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అటు రిటైల్‌ ద్రవ్యోల్బణంతో పాటు, టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. మరోవైపు అమెరికాలోనూ ద్రవ్యోల్బణం కాస్త అదుపులోకి రావడంతో వడ్డీ రేట్ల పెంపు విషయంలో సెంట్రల్‌ బ్యాంకులు మునుపటి దూకుడును కనబరచకపోవచ్చన్నది అంచనా. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

విదేశీ మదుపరులు తిరిగొచ్చారు
ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్ల పతనానికి మరో కారణం విదేశీ సంస్థాగత మదుపరులు (FPI) మన మార్కెట్లను వీడడం. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ మధ్య దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సంపదను మన మార్కెట్ల నుంచి వారు తరలించారు. అయితే, విదేశీ మదుపరులు మళ్లీ మన మార్కెట్లవైపు చూస్తుండడం మార్కెట్ల ర్యాలీకి దోహదం చేస్తోంది. జులైలో రూ.5 వేల కోట్ల ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలోకి రాగా.. ఒక్క ఆగస్టు నెలలో ఇప్పటి వరకు రూ.23,800 కోట్లు ఎఫ్‌ఐపీలు వచ్చాయి. దీనికి రిటైల్‌ సంస్థాగత మదుపరులు తోడవ్వడం 60వేల మార్కును చేరుకోవడానికి దోహదం చేశాయి.

ఈ షేర్లు రాణించాయి..
ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 షేర్లు భారీగా రాణించాయి. దాదాపు 20 నుంచి 35 శాతం మేర పెరిగాయి. వీటిలో అత్యధికంగా ఏషియన్‌ పెయింట్స్‌ బాగా రాణించింది. రెండు నెలల క్రితం ఈ షేరు విలువ రూ.2,583 ఉండగా.. నేడు రూ.3,500 స్థాయికి చేరింది. అంటే దాదాపు 35 శాతం పెరిగింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు సైతం అదే స్థాయిలో రాణించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌ కంపెనీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు 25 నుంచి 29 శాతం మేర లాభపడగా.. టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ షేర్లు సైతం 20 నుంచి 25 శాతం మేర రాణించాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్ల ర్యాలీ కొనసాగొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.