ETV Bharat / business

'కొవిడ్​ అనంతరం సొంత కార్లకు గిరాకీ.. సంక్రాంతి నుంచి బీఎస్‌ 6.2 మోడళ్లే'

author img

By

Published : Dec 28, 2022, 7:46 AM IST

కొవిడ్​ పరిణామాల అనంతరం చాలా మంది సొంత వాహనాల కొనుగోళ్లకు బాగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో కార్లుకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కొన్ని రోజులు క్రితం వరకు కొత్త కారు కొందామన్నా, వారాలు-నెలల తరబడి సరఫరా చేయలేని స్థితిని కంపెనీలు ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు కొన్నిమోడళ్లకు గిరాకీ ఉన్నా కంపెనీలు దాదాపు రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు రాయితీలను అందిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే.. బీఎస్​ 6.1 మోడళ్లు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రిజిస్టర్​ కావని.. ఫ్రెంచ్‌ సంస్థ రెనో అనుబంధ రెనో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ తెలిపారు.

new model bs6 2 cars in 2023
మామిళ్లపల్లి వెంకట్రామ్‌

కొవిడ్‌ పరిణామాల ఫలితంగా సొంత కార్లకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కొత్త కారు కొందామన్నా, వారాలు-నెలల తరబడి సరఫరా చేయలేని స్థితిని కంపెనీలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు చూస్తే, కొన్ని మోడళ్లకు గిరాకీ ఉన్నా.. రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు రాయితీని కార్ల డీలర్లు ప్రకటిస్తున్నారు. 'ఇప్పుడూ గిరాకీ ఉన్నా, వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌ 6 రెండో దశ (బీఎస్‌ 6.2) కాలుష్య ఉద్గార నిబంధనల లోపు, పాత నిల్వలు విక్రయించేందుకే సంస్థలు రాయితీలు ఇస్తున్నాయ'ని ఫ్రెంచ్‌ సంస్థ రెనో అనుబంధ రెనో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ తెలిపారు. మూడేళ్ల క్రితం బీఎస్‌ 4 నుంచి బీఎస్‌6 తొలిదశ (బీఎస్‌ 6.1)కు మారినప్పుడు నెలకొన్న పరిస్థితులే, ఇప్పుడూ ఏర్పడ్డాయని 'ఈటీవీ భారత్​' ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలివీ..

వినియోగదార్లకు ఇంకా కంపెనీలు అందించాల్సిన కార్ల సంఖ్య 7.50 లక్షలని చెబుతున్నారు. అంత గిరాకీ ఉంటే రాయితీలు ఎందుకు ఇస్తున్నారు?
కార్లు, వ్యాన్లు, ఎస్‌యూవీలు (ప్రయాణికుల వాహనాలు) కలిపి గత 6 నెలలుగా ప్రతినెలా 3 లక్షల పైనే కంపెనీల నుంచి డీలర్లకు (టోకు విక్రయాలు) చేరుతున్నాయి. డీలర్ల వద్ద రిటైల్‌ విక్రయాలు చోటుచేసుకుంటాయి. ఈ ఏడాది మొత్తమీద 38 లక్షల ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు జరగొచ్చని అంచనా. ప్రతినెలా కొత్త ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. వాటి ఆధారంగా కంపెనీలు తయారీ చేపడతాయి. అయితే అన్ని మోడళ్లకు గిరాకీ ఒకేవిధంగా ఉండదు. ఏటా జనవరి నుంచి 'కొత్త ఏడాది మోడల్‌'గా పరిగణిస్తారు కనుక, డిసెంబరులో పాత నిల్వలు వదిలించుకోడానికి కంపెనీలు, డీలర్‌షిప్‌లు కలిసి ఆఫర్లు ఇస్తుంటాయి.

వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌ 6 రెండోదశ (బీఎస్‌ 6.2) కాలుష్య ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలనే రవాణా శాఖ రిజస్టర్‌ చేయనుంది. ప్రస్తుతం తయారవుతున్న బీఎస్‌ 6.1 వాహనాలను మార్చి 31లోపే రిజిస్టర్‌ చేయాలి. అంటే.. ఇంకా ముందుగానే రిటైల్‌ విక్రయాలు పూర్తవ్వాల్సి ఉంది. లేదా తుక్కుగా వదిలేయాలి కాబట్టి.. ప్రస్తుత మోడళ్లపై రాయితీ ఇవ్వమని వినియోగదారులూ గట్టిగా అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు ఆఫర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆఫర్లు కంపెనీల కంటే డీలర్ల నుంచే అధికంగా ఉంటాయి. 2020 ఏప్రిల్‌లో బీఎస్‌ 4 నుంచి బీఎస్‌ 6 తొలిదశకు మారినప్పుడూ ఇదే పరిస్థితిని పరిశ్రమ ఎదుర్కొంది.

కొత్త ప్రమాణాలతో కారు తయారీ వ్యయాలు ఎంతమేర పెరుగుతున్నాయి?
ప్రస్తుతం కిలోమీటరుకు 130 గ్రాముల మేర కార్బన్‌డైఆక్సైడ్‌ విడుదలవుతుండగా, దీన్ని 113గ్రాములకు తగ్గించడం నూతన ప్రమాణాల లక్ష్యం. ఇది కూడా పరిశోధనా శాలలకు పరిమితం కాదు. క్షేత్రస్థాయిలో అమలవ్వాల్సిందే. అందుకే విదేశాల్లో సిద్ధంగా ఉన్న సాంకేతికతలను ఇక్కడ అమలు చేయడం కుదరదు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సరికొత్తగా ఇంజిన్లు తీర్దిదిద్దాల్సిందే. ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ప్రోగ్రామ్‌, హార్డ్‌వేర్‌, సెమీకండక్టర్లనూ మార్చాల్సి ఉంది. కారు ఇంజిన్‌ సామర్థ్యం, వాహన బరువు, పొడవు, ఏరో డైనమిక్స్‌, వాహన షేప్‌ (రూపం) ఆధారంగా తయారీ వ్యయం మారనుంది. రూ.50,000-80,000 వరకు ఒక్కో కారు తయారీ వ్యయం పెరుగుతుందని అంచనా. ఇందులో కొంతమేర భారాన్ని వినియోగదార్లకు కంపెనీలు బదలాయించనున్నాయి.

మీ సన్నద్ధత ఎలా ఉంది..
రెనో ఇండియాకు వచ్చేసరికి ఈనెల నుంచే బీఎస్‌ 6.2కు మారేందుకు కంపెనీలో ఏర్పాట్లు చేస్తున్నాం. డీలర్ల వద్ద ఉన్న బీఎస్‌ 6.1 మోడళ్లే అమ్ముడవ్వాల్సి ఉంది. జనవరి మధ్య (సంక్రాంతి పండుగ) నుంచీ డీలర్లకు బీఎస్‌ 6.2 మోడళ్లకే బిల్లింగ్‌ చేస్తాం. గిరాకీకి అనుగుణంగా, మరీ అధికంగా చేయకుండా, బ్యాలెన్స్‌డ్‌ పద్ధతిలోనే కార్లను మేము డీలర్లకు సరఫరా చేస్తున్నాం. విక్రయాల్లో ఆయా కంపెనీ శక్తి, సామర్థ్యాలు, నష్టభయ భర్తీ వంటి అంశాల ఆధారంగా బీఎస్‌ 6.2ని ఎప్పటినుంచి అందించాలనే విషయమై వేర్వేరుగా నిర్ణయాలుంటాయి. ఓవర్‌ ఇన్వెంటరీ, ఎక్సెస్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రం, పాత నిల్వలు వదిలించుకునేందుకు రాయితీల భారమూ ఎక్కువగానే ఉండొచ్చు.

పాత వాహనాల పరిస్థితి ఏమిటి..?
మార్చి 31లోపు రిజిస్టర్‌ అయిన వాహనాలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. 15 ఏళ్లు పూర్తిచేసుకున వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించి, మరో అయిదేళ్లకు అనుమతి ఇస్తున్నారు. అయితే బీఎస్‌ 6.1 కొత్త వాహనాలు మాత్రమే ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్టర్‌ కావు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.