జియో నుంచి శాటిలైట్ సేవలు.. అనుమతులు జారీ చేసిన 'డాట్'!

author img

By

Published : Sep 13, 2022, 6:39 AM IST

jio satellite

JIO Satellite: శాటిలైట్‌ ద్వారా అంతర్జాతీయ మొబైల్‌ వ్యక్తిగత కమ్యూనికేషన్‌(జీఎమ్‌పీసీఎస్‌) సేవలను అందించడానికి జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) అందిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో లైసెన్స్‌డ్‌ సర్వీస్‌ ప్రాంతాల్లో జీఎమ్‌పీసీఎస్‌ సేవలను కంపెనీ ఏర్పాటు చేసి.. నిర్వహించుకోవచ్చు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా హెచ్‌టీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ వాణిజ్య సేవలను ప్రారంభించినట్లు హ్యూజ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

JIO Satellite: శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవల నిమిత్తం టెలికాం విభాగం(డాట్‌) నుంచి రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు చెందిన శాటిలైట్‌ యూనిట్‌కు 'లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌'(ఎల్‌ఓఐ) జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. శాటిలైట్‌ ద్వారా అంతర్జాతీయ మొబైల్‌ వ్యక్తిగత కమ్యూనికేషన్‌(జీఎమ్‌పీసీఎస్‌) సేవలను అందించడానికి జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కు ఎల్‌ఓఐ అందిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో లైసెన్స్‌డ్‌ సర్వీస్‌ ప్రాంతాల్లో జీఎమ్‌పీసీఎస్‌ సేవలను కంపెనీ ఏర్పాటు చేసి, నిర్వహించుకోవచ్చు.

నిర్దేశించిన షరతులను పూర్తి చేశాక పూర్తి స్థాయి అనుమతులు లభిస్తాయి. ఈ అనుమతి లభించిన తేదీ నుంచి 20 ఏళ్ల పాటు లైసెన్సులు అమల్లో ఉంటాయి. జీఎమ్‌పీసీఎస్‌ కింద శాటిలైట్‌ ద్వారా వాయిస్‌, డేటా సేవలను అందజేయవచ్చు. లో-ఎర్త్‌ ఆర్బిట్‌(ఎల్‌ఈఓ), మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌(ఎమ్‌ఈఓ), జియోసింక్రనస్‌(జీఈఎస్‌) శాటిలైట్ల ద్వారా ఈ మొబైల్‌ శాటిలైట్‌ నెట్‌వర్క్‌లను నిర్వహించుకోవచ్చు. ఇందు కోసం లగ్జెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్‌తో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఒక సంయుక్త సంస్థను ప్రకటించింది. దీంతో ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌, సునీల్‌ మిత్తల్‌కు చెందిన వన్‌వెబ్‌లతో ముకేశ్‌ పోటీపడనున్నారు.

హెచ్‌టీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాణిజ్య సేవలు..
దేశంలోనే తొలిసారిగా హెచ్‌టీఎస్‌ (హై థ్రోపుట్‌ శాటిలైట్‌) బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ వాణిజ్య సేవలను ప్రారంభించినట్లు హ్యూజ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌సీఐ) సోమవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు, టెలికాం సంస్థలు సేవలు అందించే వీల్లేని ప్రదేశాలకు కూడా అధిక వేగంతో కూడిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను ఇది అందిస్తుంది. ఇందుకోసం ఇస్రోకు చెందిన జీశాట్‌-11, జీఎస్‌టీ-29 శాటిలైట్లను ఉపయోగించుకుంటారు.

వై-ఫై హాట్‌స్పాట్‌లు, ఎస్‌డీ- వ్యాన్‌ సొల్యూషన్ల నిర్వహణ, చిన్న వ్యాపార సంస్థలకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ లాంటి వాటికి హెచ్‌టీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు వీలు కల్పిస్తాయని కంపెనీ తెలిపింది. 'ఇస్రో శాటిలైట్‌లను ఉపయోగించుకునే కొత్త హెచ్‌టీఎస్‌ సామర్థ్యాల ద్వారా, అత్యంత నాణ్యమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడాన్ని హెచ్‌సీఐ కొనసాగిస్తుందని మేం భావిస్తున్నాం. దేశంలో డిజిటలీకరణ వ్యాప్తిని మరింత వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంద'ని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాధ్‌ తెలిపారు. 'దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ఏడాది క్రితమే హెచ్‌టీఎస్‌ సేవలను ప్రారంభించాం. వీటిల్లో లడఖ్‌లోని గల్వాన్‌ లోయ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయ'ని హెచ్‌సీఐ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌, బిజినెస్‌ హెడ్‌ శివాజీ ఛటర్జీ తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గేట్‌వేల వినియోగంపై ప్రభుత్వం ఓ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాతే హెచ్‌టీసీ బ్రాడ్‌బ్యాండ్‌ వాణిజ్య సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించామని చెప్పారు. తొలుత హెచ్‌టీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 2-10 ఎంబీపీఎస్‌ (మెగాబిట్స్‌ పర్‌ సెకండ్‌) ఇంటర్నెట్‌ వేగంతో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ఇకపై ఎలక్ట్రిక్​ హైవేలు.. టోల్​ప్లాజా వద్ద ఇక 'ఆగేదే లే'

రూ.1000 పెట్టుబడితో కోటీశ్వరులు కావచ్చు! కానీ.. ఓ ట్విస్ట్!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.