ETV Bharat / business

ఇకపై ఎలక్ట్రిక్​ హైవేలు.. టోల్​ప్లాజా వద్ద ఇక 'ఆగేదే లే'

author img

By

Published : Sep 12, 2022, 10:04 PM IST

Updated : Sep 12, 2022, 10:22 PM IST

E HIGHWAYS
union minister nitin gadkari about electric highways in india

Electric Highways In India : త్వరలో ఎలక్ట్రిక్​ హైవేలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. ఇకపై రైళ్ల లానే వాహనాలు కూడా రోడ్లపై పరుగులు తీయనున్నాయి. మరోవైపు టోల్‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకురానుంది కేంద్రం.

Electric Highways In India : విద్యుత్‌ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా దేశ రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని గడ్కరీ చెప్పారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేసే అంశంపైనా పనిచేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రోడ్లపై వెళ్లే ట్రక్కులు, బస్సులు సోలార్‌ ఎనర్జీని వినియోగించుకుంటాయని వివరించారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో సైతం సోలార్‌ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 26 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలను నిర్మిస్తున్నామని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ హైవేలు అంటే..?
ఎలక్ట్రిక్‌ హైవేలను సులువుగా చెప్పాలంటే.. ఇవీ రైల్వే లైన్లనే పోలి ఉంటాయి. రైళ్లు నడిచేటప్పుడు ఏ విధంగా అయితే పైనున్న విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని పరుగులు తీస్తాయో.. జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలు సైతం అదే విధంగా విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని వాహనంలోని బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుంటాయి. సోలార్‌ ఎనర్జీని ఇందుకోసం వినియోగించుకుంటాయి. ప్రధాన కారిడార్‌లో ఏ రూట్‌లో ఈ ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని గడ్కరీ వివరించారు.

టోల్‌ప్లాజాల వద్ద రద్దీ తగ్గుతుందిలా..: టోల్‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని ద్వారా టోల్‌ప్లాజా వద్ద వాహన రద్దీని తగ్గించడంతో పాటు టోల్‌ వర్తించే హైవేలపై ప్రయాణించిన దూరానికే టోల్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని గడ్కరీ తెలిపారు. ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దీనిపై మాట్లాడారు. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆపకుండానే ఆ వాహనం నంబర్‌ ప్లేట్‌ను రీడ్‌ చేసే కెమెరాల ద్వారా టోల్‌ ఫీజు ఆటోమేటిక్‌గా చెల్లించే విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాంకేతికత ద్వారా ట్రాఫిక్‌ను అరికట్టడమే కాకుండా వినియోగించిన దానికే చెల్లించే విధానం తీసుకురానున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

రూ.1000 పెట్టుబడితో కోటీశ్వరులు కావచ్చు! కానీ.. ఓ ట్విస్ట్!!

Last Updated :Sep 12, 2022, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.