ETV Bharat / bharat

'ప్రాథమిక విధులే మన మొదటి ప్రాధాన్యం'.. రాజ్యాంగ దినోత్సవంలో మోదీ

author img

By

Published : Nov 26, 2022, 3:27 PM IST

Updated : Nov 27, 2022, 7:42 PM IST

Constitution Day 2022 : వైవిధ్యమైన భారత దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాల్‌.. అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడమే అని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరోవైపు, దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే ప్రాథమిక విధులే మన మొదటి ప్రాధాన్యం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

constitution day 2022
constitution day 2022

Constitution Day 2022 : "ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాలని ఆశించడం కాదు.. న్యాయస్థానాలే ప్రజల చెంతకు చేరాలి" అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో శనివారం జరిగిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయవ్యవస్థలు అందుబాటులో ఉండాలని సీజేఐ ఆకాంక్షించారు.

constitution day 2022
సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్

"మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాల్‌.. అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడమే. అయితే దీనికోసం మన న్యాయవ్యవస్థ చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు దిల్లీలోని తిలక్‌ మార్గ్‌లో ఉన్నప్పటికీ అది దేశ ప్రజలందరిదీ. సర్వోన్నత న్యాయస్థానంలో వర్చువల్ పద్ధతిని తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడినుంచైనా లాయర్లు తమ కేసులను వాదించే వెసులుబాటు కల్పించాం. సాంకేతికత సాయంతో కోర్టు పనితీరును మెరుగుపరుస్తున్నాం" అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే ప్రాథమిక విధులే మన మొదటి ప్రాధాన్యం కావాలని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థను చూసి.. యావత్‌ ప్రపంచం భారత్‌వైపు సాయం కోసం చూస్తోందన్నారు. ఈ సందర్భంగా 2008 ముంబయి పేలుళ్ల ఘటనను గుర్తుచేసుకుని మృతులకు నివాళులర్పించారు. ‘‘2008లో యావత్‌ భారతావని రాజ్యాంగ దినోత్సవాన్ని చేసుకుంటున్న సమయంలో.. మన శత్రువులు భీకర ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోలేం. ఆ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నా’’ అని మోదీ తెలిపారు.

న్యాయవ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోందన్నారు కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్​ రిజుజు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అనంతరం, ఈ-కోర్టు ప్రాజెక్టు కింద పలు కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. ‘వర్చువల్ జస్టిస్‌ బుక్‌’, 'JustIS' మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్టు, 'S3WaaS' వెబ్‌సైట్లను ఆవిష్కరించారు.

ఇవీ చదవండి: గుజరాత్ అసెంబ్లీ బరిలో మజ్లిస్.. భారీగా ఓట్ల చీలిక.. లాభం ఎవరికి?

'ట్రిలియన్ డాలర్ ఎకానమీగా గుజరాత్.. ఉమ్మడి పౌరస్మృతి అమలు'.. మేనిఫెస్టోలో భాజపా హామీలు

Last Updated : Nov 27, 2022, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.