ETV Bharat / bharat

'వందే భారత్‌ రైలు యావరేజ్​ స్పీడ్ గంటకు 83 కిలోమీటర్లే.. కేవలం ఆ రూట్లోనే ఎక్కువ!'

author img

By

Published : Apr 17, 2023, 8:39 PM IST

Updated : Apr 17, 2023, 9:21 PM IST

దేశంలోనే అత్యంత స్పీడ్​ ట్రైన్​గా పేరొందిన వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలు వేగం ఎంతో చెప్పాలని రైల్వేశాఖకు ఆర్​టీఐ చట్టం కింద ఓ వ్యక్తి దరఖాస్తు చేశారు. అందుకు సమాధానంగా వందేభారత్​ రైలు వేగం గంటకు సగటున 83 కి.మీలు అని రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు.

Vande Bharat Express Speed Latest News
Vande Bharat Express Speed Latest News

వందే భారత్​.. ఇప్పుడిప్పుడే దీని పేరు అందరికీ వినిపిస్తోంది. ఇటీవలే సికింద్రాబాద్​-తిరుపతి మధ్య నడిచే వందేభారత్​ రైలును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే ఈ రైళ్లు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయో చెప్పాలని భారతీయ రైల్వేకు సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ)కింద మధ్యప్రదేశ్​కు చెందిన చంద్ర శేఖర్​ గౌర్​ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. అందుకు సమాధానంగా వీటి వేగం గంటకు సగటున 83 కి.మీల వేగంతో నడుస్తున్నాయని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.

వందేభారత్​ రైలు వాస్తవ సామర్థ్యం అధికంగా ఉన్నప్పటికీ.. దాని గరిష్ఠ వేగం ట్రాకుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఈ ఎక్స్​ప్రెస్​ వేగం గంటకు 95 కి.మీలు కూడా ప్రయాణిస్తోందని చెప్పారు. సెమీ హైస్పీడ్​ రైలుగా కూడా పిలిచే ఈ ట్రైన్​ 2021-22లో గంటకు 84.48 కి.మీల వేగంతో నడిచిందని.. 2022-23లో 81.38 కి.మీల వేగంతో ప్రయాణిస్తోందని వివరించారు. ప్రస్తుతం ఇదే సర్వీస్​ 83 కి.మీల స్పీడ్​తో నడుస్తోందని స్పష్టం చేశారు.

స్పీడ్​లో ఆ సర్వీస్​ ఫస్ట్​.. షిర్డీ ఎక్స్​ప్రెస్​ లాస్ట్​!
దిల్లీ-వారణాసి మధ్య 2019లో మొట్టమొదటి వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ సర్వీస్​ ప్రారంభమయింది. దీని వేగం సగటున గంటకు 95 కి.మీలు ఉండగా.. ముంబయి-షిర్డీ మధ్య నడుస్తున్న ఎక్స్​ప్రెస్​ వేగం అత్యల్పంగా గంటకు కేవలం 64 కి.మీలే అని రైల్వే అధికారులు వెల్లడించారు. రాణి కమలాపతి(హబీబ్‌గంజ్)- హజ్రత్ నిజాముద్దీన్ మార్గంలో నడుస్తున్న వందే భారత్ రైలు​ సగటున గంటకు 94 కి.మీల వేగంతో రెండవ స్థానంలో ఉంది. మొత్తంగా ఎప్పటి నుంచో సేవలందిస్తున్న రాజధాని, శతాబ్ది ఎక్స్​ప్రెస్​ రైళ్ల కంటే వందే భారత్​ రైళ్లు మెరుగైన సేవలందిస్తున్నాయని అధికారులు తెలిపారు.

వందే భారత్​ రైలు మొదటి వర్షన్​ 2018 అక్టోబరులో రూపుదిద్దుకుంది. ట్రయిల్​ రన్​లో భాగంగా దీనిని పరీక్షించగా గంటకు 180 కి.మీల వేగంతో పరుగులు పెట్టిందని ఓ రైల్వే అధికారి చెప్పారు. దేశంలో ప్రస్తుతం 14 ప్రధాన మార్గాల్లో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్​ ట్రైన్​గా పేరు సంపాదించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్​ను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రూపొందించింది. దీనిని చెన్నైలోని ఐసీఎఫ్​(ఇంటీగ్రల్​ కోచ్​ ఫ్యాక్టరీ) తయారు చేసింది.

భారత్​లో అత్యంత ఫాస్టెస్ట్​ ట్రైన్​గా ఎంతో గుర్తింపు పొందింది వందే భారత్​ ఎక్స్​ప్రెస్​. 2019లో ప్రారంభమయిన ఈ రైలు సర్వీసులు దేశ ప్రజలకు కాస్త ఊరట కలిగించినా.. వీటి స్పీడ్​ విషయంలో మాత్రం రాజీపడక తప్పడంలేదు. గంటకు గరిష్ఠంగా 180 కి.మీల వేగంతో, అదే వాణిజ్య అవసరాలకు 130 కి.మీల స్పీడ్​తో నడిచేలా రూపొందించిన ఈ ట్రైన్​.. ప్రస్తుతం కేవలం 83 కి.మీలే ప్రయాణిస్తోందని రైల్వే శాఖ చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Last Updated :Apr 17, 2023, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.