భాజపాకన్నా 2 రెట్లు ఎక్కువ ఖర్చు.. ఫలితం శూన్యం.. పీకే స్కెచ్​తో దీదీకి బిగ్ లాస్!

author img

By

Published : Sep 25, 2022, 4:10 PM IST

tmc goa election 2022

ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్లు తేలింది. అయితే ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు.

2022 ప్రారంభంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ రూ.47.54 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నివేదిక సమర్పించింది. టీఎంసీ.. గోవాలో ఖర్చు చేసిన మొత్తం భాజపాతో ఖర్చుతో పోలిస్తే రెండు రెట్లు అధికం. అధికార భాజపా రూ.17.75 కోట్లు ఖర్చు చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ రూ.12 కోట్లు మేర వెచ్చించింది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఆమ్​ ఆద్మీ పార్టీ.. గోవాలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసింది. 2017లో బోణీ కొట్టిన ఆప్.. 2022లోనూ పోటీ చేసింది. అయితే అనుకున్నంత మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్.. గోవాలో బోణీ కొట్టలేకపోయింది.

ఎన్సీపీ రూ.2.75 కోట్లు ఖర్చు పెట్టింది. పార్టీ తరపున పోటీ చేసిన 11 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున ప్రచారానికి ఖర్చు చేసింది. శివసేన సైతం.. గోవా ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మొత్తం రూ.92 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆప్.. గోవా ఎన్నికల బరిలో రెండో సారి నిలిచింది.

పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా గోవా ఎన్నికల్లో టీఎంసీ బరిలో దిగింది. అందుకే మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టింది. భారీగా ధనాన్ని ఎన్నికల కోసం ఖర్చు పెట్టింది. అయినా గోవాలో శాసనసభ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 23 సీట్లలో టీఎంసీ పోటీ చేయగా.. ఒక్క సీటు గెలవలేదు. టీఎంసీ భాగస్వామి పార్టీ అయిన ఎంజీపీ 13 స్థానాల్లో పోటీ చేసి 2 రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్​ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.. తృణమూల్​ కాంగ్రెస్​కు గోవాలో వ్యూహకర్తగా పనిచేశారు.

మొత్తం 40 శాసనసభ స్థానాల్లో పార్టీలవారీగా గెలిచిన సీట్లు ఇలా ఉన్నాయి.

  • భాజపా-20
  • కాంగ్రెస్-11
  • ఆమ్​ ఆద్మీ పార్టీ-2
  • గోవా ఫార్వర్డ్ బ్లాక్​-1
  • మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ-2
  • స్వతంత్రులు-3

ఆప్.. 39 మందిని బరిలో దింపగా ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. గోవా శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ, ఆప్.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాయని కాంగ్రెస్ అప్పట్లో ఆరోపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు తగ్గడం వల్ల భాజపా.. ఎంజీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ శాసనసభాపక్షం.. భాజపాలో విలీనమైంది. ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరారు.

ఇవీ చదవండి: షహీద్​ భగత్ సింగ్​ విమానాశ్రయంగా చండీగఢ్ ఎయిర్​పోర్ట్​: మోదీ

'11 మంది సంతానం.. ఎవరూ పట్టించుకోవట్లేదు.. అనుమతిస్తే చనిపోతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.