ETV Bharat / bharat

35 ఏళ్ల క్రితం ఆమె స్వీపర్.. ఇప్పుడు అదే బ్యాంకుకు AGM!

author img

By

Published : Aug 8, 2022, 6:53 PM IST

Pratiksha Tondwalkar sweeper : ఆమె చదివింది ఏడో తరగతి. 20ఏళ్లకే భర్తను కోల్పోయింది. కుమారుడి పోషణ కోసం బ్యాంకులో స్వీపర్​గా చేరింది. 35ఏళ్లు గడిచాయి. కట్ చేస్తే.. ఇప్పుడు అదే బ్యాంకుకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆమె. ఎలా సాధ్యమైంది? ఎవరామె?

pratiksha tondwalkar sweeper
ప్రతీక్షా టోండ్​వల్కర్

Pratiksha tondwalkar story : ఒకప్పుడు స్వీపర్​గా పనిచేసిన బ్యాంకులోనే అసిస్టెంట్ జనరల్​ మేనేజర్ స్థాయికి ఎదిగి.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు ప్రతీక్షా టోండ్​వల్కర్(57). కష్టాలు చుట్టుముట్టినా, పరిస్థితులు వెక్కిరించినా.. సంకల్పంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.

సవాళ్లే సోపానాలుగా..
ప్రతీక్షా టోండ్​వల్కర్.. పుణెలోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేశారు. 17 ఏళ్లకే.. 1981లో పెళ్లి చేసేశారు పెద్దలు. ప్రతీక్ష భర్త.. సదాశివ్ కడు ముంబయి స్టేట్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో బుక్​ బైండర్​గా పనిచేసేవారు సదాశివ్. తర్వాత కొంతకాలానికి వారికి కుమారుడు పుట్టాడు. పసిబిడ్డతో కలిసి సొంతూరు వెళ్లి గ్రామదేవతకు మొక్కు తీర్చుకోవాలని అనుకున్నారు సదాశివ్-ప్రతీక్ష దంపతులు. అయితే.. దురదృష్టవశాత్తూ అప్పుడు జరిగిన ప్రమాదంలో సదాశివ్ మరణించారు. ఫలితంగా 20ఏళ్ల వయసుకే భర్తను కోల్పోయి.. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలారు ప్రతీక్ష.

Pratiksha Tondwalkar of SBI : ఉద్యోగం చేద్దామంటే ప్రతీక్ష పెద్దగా చదువుకోలేదు. అందుకే స్టేట్ బ్యాంక్ అధికారులు ఆమెకు స్వీపర్ పని మాత్రమే ఇచ్చారు. రోజూ ఆమె ఉదయం 2 గంటలపాటు బ్యాంకుకు వచ్చి.. అక్కడి గదులన్నీ పరిశుభ్రం చేసేవారు. అందుకు అప్పట్లో ఆమెకు ఇచ్చిన జీతం నెలకు రూ.60-65 మాత్రమే. మిగిలిన సమయంలో వేరే చోట్ల పని చేస్తూ, కుమారుడ్ని చూసుకునేవారు. అంతటితో ఆమె ఆగిపోలేదు. మళ్లీ చదువుపై దృష్టిపెట్టారు. కష్టపడి పదో తరగతి పూర్తి చేశారు. తర్వాత ముంబయి ఎస్​ఎన్​డీటీ కళాశాలలో చేరి డిగ్రీ చదివారు. కామర్స్​లో ఉత్తీర్ణులై బ్యాంకులో క్లర్క్​గా చేరారు.

1993లో రెండో పెళ్లి చేసుకున్నారు ప్రతీక్ష. బ్యాంక్​లో మెసెంజర్​గా పనిచేసే ప్రమోద్​ టోండ్​వల్కర్​తో కొత్త జీవితం ప్రారంభించారు. ఆయన ప్రోత్సాహంతో బ్యాంకు ఇంటర్నల్ ఎగ్జామ్స్​ రాసి.. ట్రైనీ ఆఫీసర్​గా పదోన్నతి పొందారు. నిబద్ధత, నిజాయితీ, పరిశ్రమతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అంచెలంచెలుగా ఎదిగి.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరారు. ప్రస్తుతం బాంద్రాలోని ఎస్​బీఐలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.