'తన కుమార్తెకే కాంట్రాక్ట్​ ఇచ్చుకున్నారు.. లెఫ్టినెంట్​ గవర్నర్​ను తొలగించండి'

author img

By

Published : Sep 2, 2022, 9:48 PM IST

Sack Delhi LG for illegal award  demands aap
Sack Delhi LG for illegal award demands aap ()

దిల్లీ ఎల్​జీని తొలగించాలని ఆమ్​ ఆద్మీ పార్టీ డిమాండ్​ చేస్తోంది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తక్షణమే పదవి నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరారు ఆప్​ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్​ సింగ్​. దీనిపై ఎల్​జీ కార్యాలయం వెంటనే స్పందించింది.

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను ఆ పదవి నుంచి తొలగించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్​) డిమాండ్‌ చేసింది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ) ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఓ కాంట్రాక్ట్‌ను తన కుమార్తెకే కేటాయించారని పేర్కొంది. వెంటనే ఆయన్ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

Sack Delhi LG for illegal award  demands aap
ఆప్​ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్​ సింగ్​

కేవీఐసీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ముంబయిలోని ఖాదీ లాంజ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కాంట్రాక్ట్‌ను తన కుమార్తెకు వీకే సక్సేనా అక్రమంగా అప్పగించారని సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. దీనిద్వారా కేవీఐసీ చట్టం, 1961 నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఛైర్మన్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడిన సక్సేనాను వెంటనే దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరారు. ఆయనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో త్వరలోనే కోర్టును సైతం ఆశ్రయిస్తామని తెలిపారు. దీనిపై సీనియర్‌ లాయర్లతో ఆమ్‌ ఆద్మీ పార్టీ చర్చలు జరుపుతోందని సంజయ్‌ సింగ్‌ వెల్లడించారు.

ఎంపీ ఆరోపణలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం (రాజ్‌ నివాస్‌) వెంటనే స్పందించింది. ఖాదీ లాంజ్‌ ఇంటీరియల్‌ డిజైన్‌ను సక్సేనా కుమార్తె చేసిన మాట వాస్తవమే అయినా ఉచితంగా చేశారని పేర్కొంది. దీనివల్ల కేవీఐసీకి లక్షల రూపాయలు మిగిలాయని తెలిపారు. ఈ విషయంలో టెండర్‌ ఆహ్వానించడం గానీ, కేటాయించడం గానీ జరగలేదని పేర్కొంది. దీనిపై సంజయ్‌ సింగ్‌ కూడా వెంటనే స్పందించారు. సొంత కుటుంబ సభ్యులకు ఎలాంటి కాంట్రాక్ట్‌ గానీ, పని గానీ అప్పగించకూడదని కేవీఐసీ స్పష్టంగా చెబుతోందని పేర్కొన్నారు. 'మా పార్టీలో ఒక నేత కంప్యూటర్‌ ఇంజినీర్‌ ఉన్నారు. ఉచితంగా చేస్తానంటే ఆయనకు సెంట్రల్‌ విస్తా ఐటీ వర్క్‌ అప్పగిస్తారా? ఇంకొకరు ఎంబీఏ చదివారు. ఉచితంగా చేస్తానంటే ఆయనకు ప్రధాని కార్యాలయంలో మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు అప్పగిస్తారా?' అని ప్రశ్నించారు. పైగా సక్సేనా కుమార్తెకు వృత్తి పరంగా లబ్ధి చేకూర్చేందుకు ఆవిష్కార ఫలకంపై ఆమె పేరు కూడా ముద్రించారని సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.

ఇవీ చూడండి: కుమారుడు లేడని.. ముగ్గురు కుమార్తెలను గొంతునులిమి చంపిన తల్లి

ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయం భారత్​లోనే.. త్వరలో ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.