'భాజపా అధికారంలోకి వస్తే అడవులన్నీ.. వ్యాపార వేత్తలకే'.. గుజరాత్ ప్రచారంలో​ రాహుల్​ గాంధీ

author img

By

Published : Nov 21, 2022, 10:17 PM IST

rahul-gandhi

భారత్‌ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్‌ సోమవారం సూరత్‌ జిల్లాలోని మహువా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భాజపాపై విమర్శలు గుప్పించారు. మోర్బీ వంతెన కూలిన ఘటనలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాహుల్​ ఆరోపించారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. గత కొన్ని రోజులుగా భారత్‌ జోడో యాత్రలో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం తొలిసారిగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార భాజపాపై ఘాటు విమర్శలు చేశారు. మోర్బీ దుర్ఘటన విషయంలో అసలైన నిందితులకు శిక్ష పడలేదని రాహుల్​ ఆరోపించారు. 150 మంది చనిపోయారని దీన్ని రాజకీయం చేయవద్దని, దాని గురించి తాను ఏమి మాట్లాడనని చెప్పానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న తలెత్తుతుందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు నిందితులను విడిచిపెట్టి.. వాచ్​మెన్​​లను అరెస్ట్​ చేసిందని ఆరోపించారు. ఎందుకంటే ఆ నిందితులకు గుజరాత్​లోని భాజపాతో మంచి సంబంధాలు ఉన్నాయని అందుకే వారిని అరెస్ట్​ చేయలేదని విమర్శించారు. 'నిందితులపై ఎందుకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు?.. భాజపాతో సంబంధాలు ఉన్న వారికి ఏమీ జరగదా?' అని ప్రశ్నించారు.

భారత్‌ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్‌ సోమవారం సూరత్‌ జిల్లాలోని మహువా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశ ప్రజలను ఐక్యం చేసేందుకే తాను భారత్‌ జోడో యాత్ర చేపట్టానని రాహుల్‌ తెలిపారు. యాత్రలో భాగంగా తాను ఎంతోమంది రైతులు, యువత, ఆదివాసీ తెగ ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకున్నానని చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాహుల్‌ నేడు రాజ్‌కోట్‌లోనూ ప్రచారం చేపట్టనున్నారు.

'ఆదివాసీలే ఈ దేశానికి తొలి యజమానులు . కానీ భాజపా వారిని 'వనవాసులు'గా పిలుస్తోంది. మీరు నగరాల్లో ఉండాలని, మీ పిల్లలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని ఆ పార్టీ కోరుకోవట్లేదు. ఈ అడవుల్లోనే అణగారిపోవాలని అనుకుంటోంది. అది అక్కడితో ఆగిపోదు. ఆ తర్వాత మీ అడవులను కూడా వారు లాగేసుకుంటారు. భాజపా ఇలాగే అధికారంలో కొనసాగిస్తే వచ్చే 5-10 ఏళ్లలో అడవులన్నీ ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతాయి. అప్పుడు మీకు ఉండటానికి చోటు కూడా మిగలదు'
-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

అటు భాజపా కూడా ముమ్మర ప్రచారం చేస్తోంది. తన స్వరాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఒకేరోజు మూడు ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా నేడు రాష్ట్రంలో పర్యటించారు.

ప్రసంగానికి కార్యకర్త అంతరాయం..
మహువాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తుండగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రసంగాన్ని ఆయన హిందీలో ప్రారంభించగా..మరొక నేత గుజరాతీ భాషలో అనువాదం చేస్తున్నారు. ఇలా దాదాపు 13 నిమిషాల పాటు కొనసాగిన తర్వాత గ్యాలరీలో ఉన్న ఓ కార్యకర్త అరవడం మొదలు పెట్టాడు. అందరికీ హిందీ అర్థమవుతుందని, గుజరాతీలో తర్జుమా చేయాల్సిన అవసరం లేదని, ప్రసంగాన్ని కొనసాగించాలని కోరాడు. దీంతో రాహుల్‌ తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపి.. ‘ మీ అందరికీ హిందీ ఓకే అయితే.. నాకూ ఓకే’ హిందీలోనే కొనసాగిస్తానంటూ..అక్కడనున్న అనువాదకుడ్ని పంపించేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.