ETV Bharat / bharat

రాహుల్​కు నిరాశ.. పరువు నష్టం కేసులో స్టేకు హైకోర్టు నో.. తీర్పు రిజర్వ్

author img

By

Published : May 2, 2023, 5:01 PM IST

rahul defamation case
rahul defamation case

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీకి నిరాశ. పరువు నష్టం కేసులో స్టే ఇచ్చేందుకు గుజరాత్​ హైకోర్టు నిరాకరించింది.

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీకి మళ్లీ నిరాశే ఎదురైంది. రాహుల్​ వేసిన స్టే పిటిషన్‌పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్​.. వేసవి సెలవుల తర్వాత తీర్పును ప్రకటించనున్నారు. అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.

కొన్నిరోజుల క్రితం సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోర్టుకు అభ్యర్థించారు. అంతకుముందు రాహుల్​ దాఖలు చేసిన పిటిషన్​ను సూరత్​ సెషన్స్​ కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా జడ్జి ఆర్​పీ మొగేరా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్​ గాంధీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని పేర్కొన్నారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వల్ల.. కచ్చితంగా ఫిర్యాదుదారుడు పూర్ణేశ్ మోదీ ప్రతిష్ఠకు హాని కలిగి ఉండవచ్చు అని జస్టిస్​ ఆర్‌పీ మొగేరా అభిప్రాయపడ్డారు.

పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో సవాల్‌ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్​ సెషన్స్​ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.

కేసు ఏంటంటే?
2019 లోక్​సభ ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్​కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల పాటు వాయిదా వేసింది. అనంతరం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దైంది. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇటీవలే రాహుల్​.. తన బంగ్లాను ఖాళీ చేశారు. బంగ్లా తాళాలను సంబంధింత అధికారులకు అప్పజెప్పారు. ప్రస్తుతానికి ఆయన సోనియా ఇంట్లో ఉంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.