పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. జాతికి అంకితం చేయనున్న మోదీ
Published: May 18, 2023, 9:44 PM


పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. జాతికి అంకితం చేయనున్న మోదీ
Published: May 18, 2023, 9:44 PM

New Parliament Building Opening Date : నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మే28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ వివరాలను వెల్లడించింది.
New Parliament Building Opening Date : భారత నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం తుదిమెరుగుల దశలో ఉన్న కొత్త పార్లమెంటు భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని లోక్సభ సెక్రటేరియట్.. గురువారం వెల్లడించింది. కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని ఆకాంక్షించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. గురువారం ప్రధాని మోదీతో సమావేశమై నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించినట్లు తెలిపింది.
అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వర్గాలు.. ఇటీవలే ఈటీవీ భారత్కు వెల్లడించాయి. పుష్ప అలంకరణ సహా ఇతర డెకరేషన్ పనుల కోసం రూ.14 లక్షలకు టెండర్లు సైతం పిలిచినట్లు వివరించాయి. "పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తైంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ, సీపీడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇతర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారు" అని అధికార వర్గాలు వెల్లడించాయి.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా..
New Parliament Building Design : సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్పథ్ మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల స్థలంలో కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. సెంట్రల్ సెక్రెటేరియట్, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.
గతేడాది పనులు పూర్తి కావాల్సింది కానీ..
కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్లో భవనానికి పునాది రాయి వేశారు ప్రధాని మోదీ. నిజానికి గతేడాది నవంబర్లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది.
ఎన్నో ప్రత్యేకతలు..
Parliament New Building : 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.
