ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తితో వివాహేతర సంబంధం.. అడ్డొచ్చిన కూతురిని దారుణంగా..

author img

By

Published : Mar 16, 2023, 8:11 AM IST

mother killed daughter

నవమాసాలు కని పెంచిన కుమార్తెనే.. ఓ తల్లి అతి కిరాతకంగా కొట్టి చంపింది. తన వివాహేతర సంబంధానికి కుమార్తె అడ్డు అని.. తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన బంగాల్​లో జరిగింది. మరోవైపు.. ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

బంగాల్​లో దారుణం జరిగింది. తన విహాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్న కుమార్తెను అతి కిరాతకంగా హత్యచేసిందో తల్లి. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తన ప్రియుడి సాయంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కుచ్​బెహర్​ ప్రాంతానికి చెందిన అర్పితా మల్లిక్​(23) అనే యువతి హత్యకు గురైంది. అలీపుర్​దువార్​ ప్రాంతంలో అర్పితా మల్లిక్​ తన తల్లిదండ్రులు దుర్గా మల్లిక్​, బలరామ్​ మల్లిక్​లతో కలిసి ఉంటుంది. కొంతకాలం క్రితం వారి ఇంట్లోకి షంసేర్​ ఆలం అనే వ్యక్తి అద్దెకు వచ్చాడు. దీంతో అర్పితా కుటుంబానికి షంసేర్​కు​ మధ్య పరిచయం ఏర్పడింది. షంసేర్​ అప్పుడప్పుడు దుర్గా మల్లిక్ కుటుంబానికి డబ్బులు అప్పు ఇచ్చేవాడు. అయితే ఇదే క్రమంలో అర్పితా తల్లి దుర్గా మల్లిక్​కు.. షంసేర్​ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవలే ఈ విషయం అర్పితకు తెలిసింది. దీంతో అర్పిత తన తల్లిని ప్రశ్నించింది. ఈ క్రమంలో దుర్గా మల్లిక్​, షంసేర్​ కలిసి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అర్పితా మల్లిక్​ను​ హత్య చేసేందుకు ప్లాన్​ చేశారు.

బుధవారం బలరామ్​ మల్లిక్​ ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. దుర్గా మల్లిక్​ తన ప్రియుడితో కలిసి ఓ చెక్కతో అర్పితను అతి కిరాతంగా కొట్టింది. దీంతో అర్పిత గట్టిగా అరించింది. అనంతరం దుర్గా మల్లిక్​, ఆమె ప్రియుడు షంసేర్ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ అరుపులు విన్న బలరామ్​ తమ్ముడు బిమాల్​ మల్లిక్​ తన అన్నయ్య ఇంటికి వెళ్లాడు. బిమాల్​తో పాటు ఇరుగుపొరుగు వారు కూడా అక్కడకి చేరుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న అర్పితను వెంటనే ఆస్పత్రికు తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన అర్పితా చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందింది. దీంతో మృతురాలి చిన్నాన్న బిమాల్​.. పరారీలో ఉన్న నిందితులు దుర్గా మల్లిక్​, షంసేర్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..!
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఓ ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని అక్కడే వదిలి పారిపోయారు. కన్నౌజ్​ జిల్లాలోని తిర్వా ప్రాంతానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వరుసగా 16, 10, 9 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లు బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం ఊరి చివర నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను అక్కడే వదిలి ఇంటికి చేరుకున్నారు నిందితులు.

విషయం తెలుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత బాధితురాలి తండ్రి నిందితులు ఇంటికి వెళ్లి ప్రశ్నించగా.. అతడిపై దాడికి దిగారు. తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.