ETV Bharat / bharat

'బదిలీ కావాలంటే భార్యను పంపించు'.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య

author img

By

Published : Apr 11, 2022, 8:52 PM IST

JE demands wife for a night
'బదిలీ కావాలంటే భార్యను పంపించు'.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య

బదిలీ చేయాలని ఉద్యోగి కోరగా.. భార్యను తన వద్దకు పంపించాలని కోరాడు ఉన్నతాధికారి. దీంతో కలత చెందిన ఉద్యోగి పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరిలో జరిగింది. మరో ఘటనలో డ్రగ్స్ కొనేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటికే నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి.

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరిలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారి వేధింపులకు తాళలేక ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని అడిగాడు లైన్​మెన్ గోకుల్​. అయితే, బదిలీ కావాలంటే డబ్బుతో పాటు గోకుల్ భార్య తనతో గడపాలని కోరాడు ఉన్నతాధికారి. దీంతో గోకుల్​ మనస్తాపంతో పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది: లఖింపుర్​ ఖేరికి చెందిన గోకుల్ యాదవ్​ విద్యుత్​ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. అయితే, ఇండో-నేపాల్​ సరిహద్దున ఉన్న ధాహాపుర్​లో విధులు నిర్వర్తిస్తుండగా.. అలీగంజ్​కు బదిలీ చేశారు. తన కుటుంబం పాలియాలో నివసిస్తుందని.. తిరిగి అక్కడికి బదిలీ చేయాలని కోరాడు గోకుల్​ యాదవ్​. కానీ అతడి అభ్యర్థనను జేఈ నాగేంద్ర శర్మ పట్టించుకోలేదు. బదిలీ కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని.. గోకుల్​ భార్యను తనతో గడిపేందుకు పంపాలని కోరాడు నాగేంద్ర శర్మ. దీంతో మానసికంగా కలత చెందిన గోకుల్​.. ఆదివారం పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. దీంతో నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని పవర్​ కార్పోరేషన్​ యూనియన్​ డిమాండ్ చేసింది. కాగా, నాగేంద్ర శర్మతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న మరో లైన్​మెన్​ సస్పెండ్ చేస్తున్నట్లు డీఎం మహేంద్ర బహుదుర్​ సింగ్​ తెలిపారు.


డ్రగ్స్​కు బానిసై సొంత ఇంటికే నిప్పు: డ్రగ్స్​ కొనేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటికే నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని ​ రూర్కీలో జరిగింది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.

ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఇల్లు
ఇదీ జరిగింది: గంగ్నహర్​ కోత్వాలి ప్రాంతంలోని రాంపూర్​ గ్రామానికి చెందిన రాహుల్​ డ్రగ్స్​కు బానిస అయ్యాడు. డ్రగ్స్​ను కొనేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లి సవితను అడగగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన రాహుల్​.. గ్యాస్​ సిలిండర్​తో ఇంటికి నిప్పంటించాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దారి చిన్నగా ఉండటం వల్ల అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకోలేకపోయింది. దీంతో ఇంట్లోని సామాన్లన్నీ కాలి బూడిదయ్యాయి. బకెట్ల సాయంతో స్థానికులే మంటలను ఆర్పేశారు.


క్షుద్రపూజలు చేస్తుందన్న అనుమానంతో: ఉత్తర్​ప్రదేశ్​ రూర్కీ లిబర్​హెడి గ్రామంలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తుందన్న అనుమానంతో మహిళను దారుణంగా కొట్టారు గ్రామస్థులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

వైరల్​గా మారిన వీడియో
ఇదీ జరిగింది: మంగళూరు కోత్వాలి ప్రాంతంలోని లిబర్​హెడి గ్రామానికి వచ్చింది ఓ మహిళ. ఆమెతో మాట్లాడుతుండగా.. గ్రామానికి చెందిన మహిళ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఇంట్లో ఉన్న మహిళను విచారించారు. ఆమె బ్యాగులో తనిఖీ చేయగా.. క్షుద్రపూజ సామగ్రి, ఓ జంతువు ఎముక కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు..ఆమెపై దాడి చేశారు. మరోసారి గ్రామానికి రావద్దని హెచ్చరించి వదిలిపెట్టారు. కాగా, ఈ వీడియోను సోషల్​ మీడియాలో పెట్టడం వల్ల వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: మళ్లీ డ్రగ్స్ కలకలం.. రూ.60కోట్ల సరకు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.