ETV Bharat / bharat

అటెండర్​గా పనిచేసిన కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్​గా.. డ్యూటీ చేస్తూనే చదువుతూ..

author img

By

Published : Oct 13, 2022, 1:59 PM IST

Updated : Oct 13, 2022, 2:19 PM IST

ఉదయం కాలేజీకి వెళ్లి.. మధ్యాహ్నం విధులకు హాజరై.. రాత్రి పూట చదువుకున్నారు. తాను అటెండర్​గా పనిచేసే కళాశాలకే అసిస్టెంట్ ప్రొఫెసర్​గా ఎంపికయ్యారు. అటెండర్​ టూ అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా ఎదిగిన ఈ వ్యక్తి​ కథ తెలుసుకుందాం రండి.

.
.

చదవాలనే ఆసక్తి ఉంటే పేదరికం, కుటుంబ సమస్యలు ఏవీ అడ్డు రావని నిరూపించారు ఈ వ్యక్తి. ఉదయం కళాశాలకు వెళ్లి.. మధ్యాహ్నం విధులకు హాజరై.. రాత్రి పూట చదువుకున్నారు. చివరకు ఆయన అనుకున్నది సాధించారు. అంటెండర్​గా పనిచేసిన కాలేజీకే అసిస్టెంట్ ప్రొఫెసర్​గా తిరిగి వచ్చారు. తాజాగా బిహార్ విశ్వవిద్యాలయ సర్వీస్ కమిషన్​ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఈ ఉద్యోగం సంపాదించారు.

బిహార్​ భాగల్​పుర్​ ముండిచక్​కు చెందిన కమల్ కిషోర్​​ మండల్​కు చదువంటే ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు మానేసి నైట్​ వాచ్​మన్​గా పనిచేస్తున్నారు. 42 ఏళ్లున్న కిషోర్​కు 2003లో ముంగేర్​ కాలేజీలో వాచ్​మన్​గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 2008లో అక్కడి నుంచి డిప్యుటేషన్​పై అంబేడ్కర్​ పీజీ కళాశాలకు అంటెండర్​గా వెళ్లారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. పీజీ కళాశాలకు అంటెండర్​గా వెళ్లిన కిషోర్​.. విద్యార్థులు, ఉపాధ్యాయులను చూసి చదువుపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. 2013లో పీజీ పూర్తి చేశారు. 2017లో పీహెచ్​డీలో పేరు నమోదు చేసుకున్నారు. 2019లో పీహెచ్​డీ సైతం పూర్తి చేసి.. జాతీయ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు.

"2009లో పీహెచ్​డీ చేస్తానని ఉన్నతాధికారులను కోరగా.. మూడేళ్ల తర్వాత 2012లో అనుమతి ఇచ్చారు. నా పేదరికం, కుటుంబ సమస్యలను చదువుకు అడ్డుకాలేదు. ఉదయం కళాశాలకు వెళ్లి తరగతులకు హాజరయ్యాను. మధ్యాహ్నం వచ్చి డ్యూటీ చేసేవాడిని. ఉదయం చెప్పిన విషయాలను రాత్రి తిరిగి చదువుకునేవాడిని."

--కమల్​ కిషోర్ మండల్​, అసిస్టెంట్ ప్రొఫెసర్​

2019లో జాతీయ ప్రవేశ పరీక్ష అర్హత సాధించిన కిషోర్​.. ఉద్యోగాల భర్తీ కోసం వేచిచూశారు. 2020లో బిహార్​ రాష్ట్ర విశ్వవిద్యాలయ సర్వీస్ కమిషన్​ నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 12 మందిని ఇంటర్వ్యూకు పిలవగా అందులో కిషోర్ ఒకరు. అన్ని దశలను దాటుకుని చివరకు తాను పని చేసిన అంబేడ్కర్ పీజీ కళాశాలలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్​గా నియమితులయ్యారు. దీంతో కిషోర్​ సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎంతో సహకరించిన ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నానని కిషోర్ చెప్పారు. అటు ఉద్యోగం చేస్తూ.. చదువుకుని ఈ ఉద్యోగం సాధించి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఉన్నతాధికారులు అభినందించారు.

ఇవీ చదవండి: జాతరలో బోర్ కొట్టి చెరువు గట్టున వాకింగ్.. వజ్రం దొరికి రాత్రికి రాత్రే లక్షాధికారిగా...

మరో దారుణం.. బాలికను నరబలి ఇచ్చిన దుండగులు.. తండ్రికి తెలిసే జరిగిందా?

Last Updated :Oct 13, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.