ETV Bharat / bharat

G 20 Meeting in India 2023 : జీ20కి సర్వం సిద్ధం.. తొలిసారి భారత్​ ఆతిథ్యం.. సత్తా చాటేలా ఏర్పాట్లు..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 6:52 AM IST

Updated : Sep 9, 2023, 7:21 AM IST

G 20 Meeting in India 2023 : భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. జీ-20 సదస్సుకు తొలిసారి ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో.. భారత సంప్రదాయాలు, సామర్థ్యాలను ప్రపంచానికి చాటాలని భావిస్తోంది.

g-20-meeting-in-india-2023-and-about-g20-summit-2023
భారత్​ జీ20 సమావేశం 2023

G 20 Meeting in India 2023 : జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండురోజులపాటు జరగనున్నాయి. భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ-20 దేశాల కూటమి ప్రభుత్వాల కలయికతో ఏర్పడిన వేదిక. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులుగా ఉన్నాయి.

అంతర్జాతీయ ఆర్థికస్థిరత్వం, వాతావరణ మార్పుల తీవ్రత తగ్గింపు, సుస్థిరాభివృద్ధి వంటి అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు ఈ కూటమి పనిచేస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అత్యధిక దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు జీ-20 కూటమిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థూల ఉత్పాదకతలో 80శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింటి రెండో వంతు, ప్రపంచ విస్తీర్ణంలో 60శాతంగా ఉన్నాయి.

About G20 Summit 2023 : ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో 1999లో జీ-20 దేశాల కూటమి ఏర్పాటైంది. అయితే 2008 నుంచి ఏడాదికోసారి సమావేశం కావటం ప్రారంభమైంది. సభ్య దేశాల తరఫున ప్రభుత్వ అధినేత లేదా ఆర్థికమంత్రి లేదా విదేశాంగశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఇతర దేశాలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు, నాన్-గవర్నమెంటల్ సంస్థలను కూడా జీ-20 సదస్సులకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. కొన్నింటికి శాశ్వత ఆహ్వానం ఉంటుంది.

ఈ ఏడాది రోటేషన్‌ పద్ధతిలో జీ-20 సదస్సుకు దిల్లీ వేదిక అయింది. గతేడాది 2022లో ఇండోనేషియాలో ఈ సమావేశాలు జరిగాయి. దిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించనుంది. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య ఆర్థిక ప్రగతిని విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలపై జీ-20 దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఈ సమావేశాల చివరిరోజు భారత్‌ జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది.

భారీ సైకత శిల్పం..
Sudarsan Pattnaik G20 : జీ20 సమావేశాల నేపథ్యంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​.. ఒడిశాలోని పూరీ బీచ్​లో భారీ జీ20 లోగోను ఇసుకతో రూపొందించి అతిధులకు ఆహ్వానం పలికారు. 150 అడుగులు పొడువు, 50 అడుగుల వెడల్పుతో దీన్ని తయారు చేశారు.

Antonio Guterres India : 'భారత్​ 'విశ్వ దేశం'.. కానీ..' ఐరాసలో శాశ్వత సభ్యత్వంపై గుటెరస్ కీలక వ్యాఖ్యలు

Modi Biden Bilateral Talks : మోదీతో బైడెన్​ కీలక చర్చలు.. భారత్​కు భద్రతా మండలి సభ్యత్వానికి మద్దతు.. 2028లోనే..

Last Updated :Sep 9, 2023, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.