ETV Bharat / bharat

'మానవాళికి ఉగ్రవాదం ముప్పు.. ముష్కరులకు కీలక ఆయుధంగా 'సోషల్ మీడియా'!'

author img

By

Published : Oct 29, 2022, 2:59 PM IST

మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని.. ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ 'గ్రే లిస్ట్‌' వల్లే జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా భారత్ ప్రస్తావించింది.

counter terrorism
జైశంకర్

మానవత్వానికి పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైన అంశాల్లో తీవ్రవాదం ఒకటిని విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. తీవ్రవాదాన్ని ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహక వ్యాపారంగా మార్చుకున్న దేశాలపై ఐక్యరాజ్యసమితి తీవ్రవాద వ్యతిరేక విభాగం ఆంక్షలు ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపారు. దిల్లీలో జరుగుతున్న ఐరాస భద్రతా మండలి.. తీవ్రవాద వ్యతిరేక కమిటీ సమావేశంలో జైశంకర్‌ పాల్గొన్నారు.

పాకిస్థాన్‌పై పరోక్ష విమర్శలు గుప్పించిన జైశంకర్‌.. ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో తీవ్రవాదం పెరుగుతూ, విస్తరిస్తూ ఉందన్నారు. సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలు తీవ్రవాద ముఠాలకు పనిముట్లుగా మారాయని జైశంకర్ చెప్పారు. ఉదారవాద విధానాలను పాటిస్తున్న సమాజాల స్వేచ్ఛ, సమతౌల్యం, ప్రగతిపై సాంకేతికతను ఉపయోగించి దాడులు చేస్తున్నారని కేంద్రమంత్రి వివరించారు. ముష్కర మూకలు, వ్యవస్థీకృత నేర ముఠాలు ఉపయోగిస్తున్న డ్రోన్లు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు అదనపు ఆందోళన కలిగిస్తున్నాయని జైశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు.

పాక్‌ గ్రే లిస్ట్‌లో ఉండగా దాడులు తగ్గాయి..
ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్ట్‌ వల్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో భారత్‌ వెల్లడించింది. ఈ పరస్పర సంబంధాన్ని ఈ కమిటీ పరిశీలించాలని కోరింది. ఇటీవల 'గ్రే లిస్ట్‌' నుంచి పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ తొలగించింది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థాన్‌కు ఏర్పడింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడిచేసే లక్ష్యాలను పాక్‌ అందుకోకపోవడం వల్ల ఎఫ్‌ఏటీఎఫ్‌ నాలుగేళ్లపాటు ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచింది.

ఇవీ చదవండి: వందే భారత్ ఎక్స్​ప్రెస్​కు మరో విఘ్నం.. పశువును ఢీకొట్టిన రైలు

పూజ కోసం ప్రసాదం చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. 30 మందికి పైగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.