ETV Bharat / bharat

బలపరీక్షలో నెగ్గిన నీతీశ్, విపక్షాల ఐక్యతకు పిలుపు, మోదీపై సెటైర్లు

author img

By

Published : Aug 24, 2022, 6:28 PM IST

bihar-assembly-trust-vote
bihar-assembly-trust-vote

బిహార్‌ శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాగట్‌ బంధన్ ప్రభుత్వం నెగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య స్పీకర్‌ రాజీనామా చేయగా డిప్యూటీ స్పీకర్‌ బలపరీక్ష నిర్వహించారు. ఓటింగ్‌ను బహిష్కరించిన భాజపా సభ నుంచి వాకౌట్‌ చేసింది. ఇదే సమయంలో కమలం పార్టీ తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించిన నీతీశ్‌ భాజపా అధిష్ఠానంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Bihar assembly floor test : భాజపా బంధానికి స్వస్తి పలికి కొత్త కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్‌ కుమార్‌ బలనిరూపణలో విజయం సాధించారు. ఈనెల 10న ఆర్జేడీ, కాంగ్రెస్‌ సహా పలుపార్టీలతో కలిసి మహాగట్‌ బంధన్‌ ప్రభుత్వం అధికారాన్ని దక్కించుకోగా.. ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. అనంతరం ఇవాళ నిర్వహించిన బలపరీక్షలో నెగ్గి నీతీశ్‌ తన పదవిని కాపాడుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి మహేశ్వర్ హజారీ ప్రత్యక్ష ఓటింగ్ నిర్వహించారు. 243మంది సభ్యులుగల బిహార్‌ శాసనసభలో 160 ఓట్లతో నీతీశ్‌ సర్కార్ విజయం సాధించారు. బలపరీక్ష అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి తెలిపారు. ఖాళీ అయిన స్పీకర్ స్థానానికి గురువారం నామినేషన్లు తీసుకోనునన్నట్లు పేర్కొన్నారు.

సభలో ప్రసంగించిన నీతీశ్‌.. ఎల్​జేపీ నేత చిరాగ్ పాస్‌వాన్ తిరుగుబాటును పరోక్షంగా ప్రస్తావించారు. భాజపా ఆదేశాలతో ఆర్సీపీ సింగ్.. జేడీయూలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని పదవి కోసమే మహాగట్‌ బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న భాజపా ఆరోపణలను ఖండించిన నీతీశ్‌.. తనకు వ్యక్తిగత ఆశయాలు లేవని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికలకు ఐక్యం కావాలని దేశంలోని అన్నిపార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో భాజపాతో తన పాత బంధాన్ని గుర్తుచేసుకున్న నీతీశ్‌.. వాజ్‌పేయి, అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషికి.. ప్రస్తుత కమలదళం అధినాయకత్వానికి ఉన్న తేడాను నొక్కిచెప్పారు. ప్రస్తుత పాలనలో ప్రచారం తప్ప పాలన చాలా తక్కువ అని ప్రధాని పేరు ప్రస్తావించకుండా నీతీశ్‌ వ్యాఖ్యానించారు.

అనంతరం, సభలో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్‌ ప్రభుత్వ కొత్త భాగస్వామ్యం చారిత్రకమని అభివర్ణించారు. ఇది ముగిసిపోయే ఇన్నింగ్స్‌ కాదన్న తేజస్వీ.. ఎవరూ రనౌట్‌ కారని వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా మాట్లాడిన భాజపా నేత తారాకిషోర్‌ ప్రసాద్‌.. నీతీశ్‌ కుమార్‌ రాజకీయ విశ్వసనీయతను కోల్పోయారని విమర్శించారు. సొంతంగా ముఖ్యమంత్రి కాలేని వ్యక్తి ప్రధానమంత్రి కావాలనే వ్యక్తిగత లక్ష్యాన్ని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

స్పీకర్ రాజీనామా
అంతకుముందు అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందు నుంచి స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేది లేదని పట్టుబట్టిన భాజపా నేత విజయ్‌ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ఆయన రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు భావో‌ద్వేగానికి గురైన విజయ్‌ కుమార్‌ తనపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు. తాను రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.