ETV Bharat / bharat

'చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది'

author img

By

Published : Sep 4, 2020, 11:33 AM IST

రెండు మూడు నెలలుగా వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్నాయని భారత సైనికాధిపతి ఎంఎం నరవణె స్పష్టం చేశారు. అయితే, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్ధంగా ఉందని వెల్లడించారు. చైనాతో విభేదాల పరిష్కారానికి చర్చలకే ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

army chief
ఎంఎం నరవణె

వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని భారత సైనికాధిపతి ఎంఎం నరవణె తెలిపారు. సరిహద్దుల్లో భద్రత కోసం ముందస్తు మోహరింపు చేపట్టామని, సైనికులు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశ సమగ్రతకు ఎలాంటి నష్టం లేదని హామీ ఇచ్చారు.

"రెండు మూడు నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, ఎప్పటికప్పుడు చైనాతో సైనిక, దౌత్య చర్చలు నిర్వహిస్తూనే ఉన్నాం. వీటిని కొనసాగిస్తాం. రెండు దేశాల మధ్య విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. యథాతథ స్థితిని మార్చకుండా మన ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం."

- ఎంఎం నరవణె, సైనికాధిపతి

సరిహద్దుల్లో సైన్య సన్నద్ధతను పరిశీలించేందుకు లేహ్​లో పర్యటించారు నరవణె. అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మన సైనికులు, అధికారులు ప్రపంచంలోనే మేటి అని కొనియాడారు నరవణె. వాళ్లు సైన్యానికే కాదు, దేశానికే గర్వకారణమని తెలిపారు.

ఇదీ చూడండి: చైనా కుట్రలకు దీటుగా భారత్​ సరికొత్త వ్యూహాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.