ETV Bharat / bharat

'కులం వద్దు.. వర్గం వద్దు'.. ప్రభుత్వ బడులపై సర్కార్​ కీలక నిర్ణయం!

author img

By

Published : Dec 30, 2022, 10:40 PM IST

Punjab government
పంజాబ్ ప్రభుత్వం

పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులం పేరుతో ఉన్న 56 ప్రభుత్వ పాఠశాల పేర్లను మార్చింది. వాటికి గ్రామం, స్థానిక అమరవీరుడు లేదా ముఖ్యమైన వ్యక్తి పేరును పెట్టినట్లు తెలిపింది.

కులం పేరుతో కూడిన ప్రభుత్వ పాఠశాలలపై పంజాబ్‌లోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి 56 పాఠశాలల పేర్లను మార్చింది. కులం, వర్గం ఆధారంగా ఉన్న బడుల పేర్లను మార్చాలని విద్యాశాఖ మంత్రి హర్‌జోత్‌ సింగ్‌ ఆదేశించిన వారంలోనే అధికారులు దీన్ని అమలు చేశారు. గ్రామం, స్థానిక అమరవీరుడు లేదా ముఖ్యమైన వ్యక్తి పేరుతో వాటిని మార్చినట్లు వారు వెల్లడించారు.

'సమానత్వం ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఒకే తరహా విద్య అందించాలి. పాఠశాలల పేర్లూ.. ఒక కులానికో, వర్గానికో చెందినవిగా ఉండకూడదు. అలా ఉంటే.. విద్యార్థుల్లో అనాగరికులమనే భావన కలుగుతుంది. దీనికి తోడు సమాజంలో కుల విభజనకు దారితీస్తాయి. అందుకే పాఠశాలలకు అటువంటి పేర్లను తొలగించాలి' అని పంజాబ్‌ విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కులాలు, ఇతర వర్గాలతో కూడిన పాఠశాలల వివరాలు అందివ్వాలంటూ విద్యాశాఖ ఇటీవల అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించింది. అనంతరం పరిశీలించిన అధికారులు.. 56 ప్రభుత్వ బడుల పేర్లను మార్చారు. వీటిలో ప్రాథమిక, హైస్కూళ్లు ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని ఆప్‌ పంజాబ్‌ యూనిట్‌ స్వాగతించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.