రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు - బాసర ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం
Published : Feb 14, 2024, 10:23 AM IST
Vasantha Panchami Celebration In Basara : రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. పద్మశాలి సంఘం తరఫున అందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభిషేక సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 3 గంటల నుంచి చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు.
Edupayala Durgamma Temple : మరోవైపు ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ మాత అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. ఇంకోవైపు సిద్దిపేటలోని వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.