కేసులపై టీడీపీ నేతల పిటిషన్- పూర్తి వివరాలు సమర్పించాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశం - High Court on TDP Leaders petition
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 11:52 AM IST
High Court on TDP Leaders Cases Details Petition: కేసుల వివరాలు తెలపాలంటూ పలువురు టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదు చేసిన కేసుల వివరాలను అందజేసేలా ఆయా జిల్లాల ఎస్పీలను, రాష్ట్ర డీజీపీని ఆదేశించాలంటూ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు వ్యాజ్యాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో తమపై నమోదైన కేసుల పూర్తి వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉన్నందున వివరాలను కోరుతున్నట్లు టీడీపీ నేతలు అయ్యన్న, పల్లా శ్రీనివాసరావు, బొండా ఉమ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ఠాణాలలో నమోదైన కేసుల వివరాలు అందజేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.