జనసేనకు పార్టీకి రూ. 10 కోట్ల విరాళమిచ్చిన పవన్ కల్యాణ్ - Pawan Kalyan Donates Rs 10 Crores

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 10:35 PM IST

thumbnail

Pawan Kalyan Donates Rs 10 Crores:  జనసేనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రూ. 10 కోట్ల విరాళమిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారి సమక్షంలో కోశాధికారి ఎ.వి‌.రత్నం కి విరాళానికి సంబంధించిన చెక్కు అందజేశారు. జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం పవన్ స్వార్జితాన్ని ఇచ్చినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘‘స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ సంపాదనను ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఓ మంచి ఆశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి, ఈ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం రూ.10 కోట్లను అందిస్తున్నట్లు పవన్  తెలిపారు. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

జనసేన కోసం ఓ బెల్దారీ మేస్త్రి రూ. లక్ష విరాళం అందించిన విషయం పవన్ ప్రస్తావించారు. ఇలా ఎందరో కూలీలు కూడా వంద, రెండు వందల విరాళాలు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు కొందరు తమ పింఛను సొమ్ములో కొంత భాగం పార్టీకి పంపుతున్నట్లు చెప్పారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. అలాంటి వారి స్ఫూర్తితో నేను  సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉందని పవన్ తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.