రాష్ట్రంలో సామాజికన్యాయం లేదు - నియామకాల్లో ఒకే వర్గీయులు ఉంటున్నారు : మందకృష్ణ మాదిగ - Manda Krishna On CM Revanth
Published : Apr 24, 2024, 7:31 PM IST
Manda Krishna On Social Justice : రాష్ట్రంలో సామాజికన్యాయం లేదని, ఏ నియామకం చూసినా ఒకే వర్గీయులు ఉంటున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోకడలు, తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నాయని ఆక్షేపించారు. ఇప్పటి వరకు చేపట్టిన కీలక పదవుల నియామకాల్లో రెడ్డి కులానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ఏ ఒక్క కులానికైనా ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సాంబశివారెడ్డినే నియమించారు. రెడ్డియేతర ఆఫీసర్ల పట్ల నమ్మకం లేదా? అని ఆరోపించారు. ఒక్క రెడ్డి కులస్థులు ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. బీఆర్ఎస్పై వ్యతిరేకతతో అన్ని వర్గాలు ఓట్లేస్తే పార్టీ గెలిచింది. రేవంత్ సీఎం అయ్యారని తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు సీఎం కులానికి చెందిన(రెడ్డి) ఆరుగురికి టికెట్లు ఇచ్చుకున్నారని ప్రస్తావించారు. అగ్రకులాల్లో బ్రాహ్మణ, కమ్మ, వెలమ వర్గాలకు అవకాశాలు ఇచ్చారా? అని మందకృష్ణ ప్రశ్నించారు. తన తర్వాత సీఎంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హులు అన్న రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ మంత్రిగా కొండా సురేఖ, గిరిజన మంత్రిగా సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గం నుంచి దామోదర్ రాజనరసింహ ఉన్నప్పటికీ వీరెవరూ అర్హులు కాదా అని విమర్శించారు. నామినేషన్ దాఖలుకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్నా ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఎందుకు ఏకాభిప్రాయం రాలేదు? ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఎలా ఏకాభిప్రాయం వచ్చిందని ఆయన ప్రశ్నించారు.