మల్లారెడ్డి విద్య, వైద్యాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారు : మైనంపల్లి రోహిత్
Published : Mar 18, 2024, 7:55 PM IST
MLA Mynampally Rohit Rao Fires On Malla Reddy : గత ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి దోచుకున్న, దాచుకున్న ప్రతి పైసా బయటకు తీస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంప్లలి రోహిత్ అన్నారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన రోహిత్ ఇకపై మల్లారెడ్డి అక్రమాలు సాగవని హెచ్చరించారు. మల్లారెడ్డి కుటుంబం విద్యను, విద్యార్థులను, వైద్యం పేరును రాజకీయం కోసం వాడుకుని కోట్లు దండుకుంటున్నారన్న రోహిత్ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అవగాహన లేని వారు కళాశాల నడుపుకుంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను హింస పెడుతున్నారని మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యంతో ఎన్నికల ప్రచారాలు చేయిస్తున్నారని వాఖ్యానించారు. విద్యార్థులను ఎన్నికల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఫ్రీ ఆసుపత్రి అని డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. మల్లారెడ్డి సంస్థలో జరుగుతున్న ఆక్రమణలపై ముఖ్యమంత్రి, అధికారులతో మాట్లాడి విచారణ జరిపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అవన్నీ తీరే వరకు పోరాడతామని తెలిపారు.