స్నానం చేస్తూ కూడవెళ్లి వాగులో వ్యక్తి గల్లంతు
Published : Feb 9, 2024, 8:07 PM IST
Man Washed Away in Kudavelli Vagu : సిద్దిపేట జిల్లా కూడవెళ్లిలో దుర్ఘటన చోటుచేసుకుంది. మాఘ స్నానాలను ఆచరిస్తున్న క్రమంలో మిరుదొడ్డికి చెందిన స్వామి అనే వ్యక్తి కూడవెళ్లి వాగులో గల్లంతయ్యాడు. ఉద్ధృతంగా వస్తున్న ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా సదరు వ్యక్తిని రక్షించలేకపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతయిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Kudavelli Ramalingeswara Temple : ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కూడవెళ్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడికి ఏటా మాఘమాస స్నానాలను ఆచరించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. అనంతరం వాగు పక్కనే ఉన్న ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటారు. గత మూడేళ్లుగా మల్లన్న సాగర్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయడంతో వాగు జళకళను సంతరించుకుంది. వాగులో ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి వాగువద్ద స్నానాలఘాట్లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.